Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఓ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర సీఎం మాట్లాడిన మాటలు వింటుంటే సైకో లాగా, శాడిస్ట్ లాగా ఉందే తప్ప బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిలా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎండలకు ఎండిపోతున్న పొలాలకు నీళ్లు పారించమని ప్రతిపక్షాలు కోరుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం దానికి సమాధానం చెప్పకుండా నోటికి వచ్చినట్లు బూతులు పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటల్లో కేవలం అబద్ధాలు, బూతులు, శాపనార్థాలు తప్ప మరేమీ కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
పొలాలకు నీళ్లు పారించమంటే.. ప్రతిపక్షాల రక్తం పారిస్తాం అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటంపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ప్రతిపక్షాల రక్తం అడుగుతారా? ప్రజల కోసం అవసరమైతే మా రక్తం ఇస్తాము. నిన్న షాబాద్లో జరిగిన ఘోర ఉదంతంలో నరహంతకుడైన రాజ్కుమార్కు, ఇలా రక్తం పారిస్తామంటున్న ఈ ముఖ్యమంత్రికి తేడా ఏంటి?” అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి కనీస విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్లే ఇలాంటి అసభ్యకరమైన బూతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి షాబాద్ దారుణ ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే, మన రాష్ట్ర సీఎం మాత్రం దానిపై నోరు మెదపకుండా రాజకీయ విమర్శలు, బూతులు మాట్లాడటానికే ప్రాధాన్యత ఇచ్చారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన అసభ్యకర వ్యాఖ్యలను ఒకసారి టీవీల్లో రివైండ్ చేసి చూసుకోవాలని, ఆ మాటలు విన్న తర్వాతైనా ఆయన రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “నీకు మా రక్తం కావాలా.. అయితే తీసుకో, దానికి మేము సిద్ధం. కానీ ఎండిపోతున్న రైతుల పొలాలకు మాత్రం తక్షణమే సాగునీరు పారించు” అని కోరారు.




