India Cuts Windfall Tax on Fuel Exports: ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశీయ మార్కెట్లకు, ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిచ్చింది. అంతర్జాతీయంగా ఎనర్జీ సంక్షోభ పరిస్థితుల్లో విధించిన విండ్ఫాల్ పన్ను (Windfall Tax)ను ప్రభుత్వం తగ్గించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం అర్థరాత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సవరించిన కొత్త పన్ను రేట్లు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో కరూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వం ఈ పన్ను రేట్లను సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది.
ఈ కొత్త నిర్ణయం ప్రకారం విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై లీటరుకు రూ. 2.5 చొప్పున పన్ను తగ్గించడంతో, ఇది రూ. 19.5కి చేరింది. డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 24 వద్దే యథాతథంగా ఉంచినప్పటికీ, దానికి వర్తించే రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ను లీటరుకు రూ. 1.5 నుంచి సున్నాకి తగ్గించారు. అలాగే పెట్రోల్ ఎగుమతులపై ఉండే విండ్ఫాల్ పన్నును కూడా పూర్తిగా సున్నా చేశారు. వారం క్రితం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన ఎగుమతి సుంకాలను పెంచిన కేంద్రం, రిఫైనింగ్ మార్జిన్లు, గ్లోబల్ ట్రెండ్స్ను బట్టి ఇప్పుడు ఈ సవరణలు చేసింది. అయితే ఎగుమతి పన్నుల్లో మార్పులు చేసినప్పటికీ, మన దేశంలో సాధారణ ప్రజలు వాడే పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకంలో ప్రభుత్వం ఎలాంటి మార్పూ చేయలేదు. దీంతో దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 నాటికి గ్లోబల్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మన దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పాత రేట్లలోనే ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12గా ఉండగా, ముంబైలో రూ. 111.2గా నమోదు కాగా, మెజారిటీ మెట్రో నగరాల్లో డీజిల్ ధర లీటరుకు రూ. 100 కంటే తక్కువగానే కొనసాగుతోంది.




