Chief Minister Revanth Reddy: ఛైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కోసం గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని, ఇకపై పనితీరు ఆధారంగానే గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాయకత్వం అంటే హైదరాబాద్లోని ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు, ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయడమన్నారు. పదవుల కోసం పైరవీలు చేసే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వవద్దని కరాఖండిగా చెప్పారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయి బాధ్యతలపైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులెవ్వరూ గాంధీభవన్కు రావొద్దంటూ తెలిపారు.
“కొందరు నాయకులు హైదరాబాద్లో కూర్చొని పనిచేయడం లేదు. సోమవారం పది మంది ఇన్ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలి. ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తాం. అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటాం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జ్లను సమన్వయం చేయాలి. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్పై సీరియస్గా దృష్టి సారించాలి. బాగా పనిచేసే 100 మంది బీఎల్ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫొటో దిగే అవకాశం కల్పించాలి.” అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.




