అసోం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టానికి నేడు వేదిక సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ మరోసారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గౌహతిలో నిర్వహించనున్న ఈ భారీ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానుండగా.. పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు.
అసోం సీఎం ప్రమాణస్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు నేడు అసోంలోని గౌహతి నగరానికి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గౌహతిలోని వెటిరినరీ కాలేజీ గ్రౌండ్కు చేరుకుని.. 10:15 గంటలకు జరగనున్న హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి బలాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమానికి పలువురు కీలక నేతలు హాజరవుతున్నారు. ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు.
ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు గౌహతి నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. అనంతరం సాయంత్రం 4:20 గంటలకు అమరావతికి చేరుకోనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో గౌహతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో బీజేపీ స్వయంగా 82 సీట్లు గెలిచింది. మొత్తంగా ఎన్డీఏ 102 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీజేపీ అసోంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇదివరకు 2016, 2021లో కూడా అధికారంలోకి వచ్చింది.




