Delhi Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. సరిగ్గా వేడుకలకు ఒక్కరోజు ముందు, శుక్రవారం నాడు ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (టర్మినల్-3)తో పాటు మరో నాలుగు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు లేఖలు రావడం అప్రమత్తతకు దారితీసింది. ఢిల్లీ హైకోర్టు, ఐజీఐ విమానాశ్రయంతో పాటు జామ్నగర్ హౌస్, జండేవాలాన్లోని ఒక భవనం, సాకేత్లోని ఓ కార్యాలయం, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎమ్ (SDM) కార్యాలయాలకు ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, బాంబు నిరోధక బృందాలు (BDS), స్నిఫర్ డాగ్ స్క్వాడ్లతో కూడిన అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఆయా ప్రాంతాల్లో భద్రతా సంస్థలు, స్థానిక పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాల ఆనవాళ్లు గానీ లభించలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఢిల్లీ హైకోర్టుకు ఈ బెదిరింపు ఈ-మెయిల్ ద్వారా వచ్చింది. మధ్యాహ్నం 2:11 గంటలకు హైకోర్టులో పేలుడు జరుగుతుందని ఆ మెయిల్లో పేర్కొనడంతో భద్రతా దళాలు వెంటనే కోర్టు ప్రాంగణంలో తనిఖీలు మొదలుపెట్టాయి. ఈ విషయమై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నిరంతరం ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కోర్టు ఆవరణలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు పూర్తి చేశాయి. ఈ బెదిరింపులు వచ్చినప్పటికీ కోర్టు కార్యకలాపాలు యథాతథంగా కొనసాగాయి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఇవన్నీ కేవలం నకిలీ (హోక్స్) బెదిరింపులుగానే కనిపిస్తున్నాయని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, పోలీస్ అధికారులు వెల్లడించారు.




