రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, వారికి మెరుగైన పాలన అందించడమే ధ్యేయంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం ప్రత్యేకంగా ‘ప్రజాదర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజల నుండి ఆయన స్వయంగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జూన్ 12 నుంచి కొత్త వితంతు పింఛన్లు
ప్రజాదర్బార్లో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ లబ్ధిదారులకు ఒక ముఖ్య ప్రకటన చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని, అర్హులైన వితంతువులకు జూన్ 12వ తేదీ నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. అర్హత ఉండి పింఛన్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు (రిజిస్ట్రేషన్) చేసుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక సదుపాయాన్ని కల్పించబోతోందని ఆయన వివరించారు.
రెవెన్యూ సమస్యలపై అధికారులకు ఆదేశాలు
గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ వివాదాలు, పరిపాలనా లోపాల వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో అనేక రెవెన్యూ సమస్యలు తలెత్తాయని మంత్రి విమర్శించారు. భూ రికార్డుల గందరగోళం కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను అధిగమించడానికి తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజాదర్బార్లో వచ్చిన రెవెన్యూ అర్జీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అక్కడ ఉన్న ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హునికి అందేలా చూడటంతో పాటు, క్షేత్రస్థాయిలో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకమైన సేవలను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.




