Akhil Raj: రాజు వెడ్స్ రాంభాయ్ సినిమా హీరో అఖిల్ రాజ్ ఓ డెలివరీ వర్కర్పై జరిపిన దాడిని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) తీవ్రంగా ఖండించింది. కేవలం తప్పు ఆర్డర్ డెలివరీ చేశాడనే చిన్న కారణంతో అఖిల్ రాజ్ సదరు కార్మికుడిపై భౌతిక దాడికి దిగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యూనియన్ పేర్కొంది. అంతేకాకుండా, అతని తల్లి కూడా ఆ శ్రమజీవిపై ఉమ్మివేసి అవమానించిందన్న ఆరోపణలు రావడం మరింత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. పేరు, ప్రతిష్ట, సెలబ్రిటీ హోదా ఉన్నంత మాత్రాన సమాజంలో కష్టపడి బతికే కార్మికులను అవమానించే లేదా వారిపై దాడులు చేసే హక్కు ఎవరికీ రాదని స్పష్టం చేసింది. డెలివరీ వర్కర్లు ఎండ, వర్షం, ట్రాఫిక్, ఎన్నో ఒత్తిళ్ల మధ్య నిరంతరం ప్రజలకు సేవలందించే శ్రమజీవులని యూనియన్ గుర్తుచేసింది. నిరంతర పని ఒత్తిడిలో ఏ వృత్తిలోనైనా చిన్నపాటి పొరపాట్లు జరగడం సహజమని, అయితే ఆ పొరపాటుకు ప్రతిగా ఇలా హింసకు దిగడం, దౌర్జన్యం చేయడం, అమానుషంగా అవమానించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని తేల్చిచెప్పింది. బాధితుడైన డెలివరీ వర్కర్ తన పొరపాటుకు పలుమార్లు క్షమాపణలు చెప్పినప్పటికీ వినకుండా, అతనిని తీవ్రంగా కొట్టి, దారుణంగా అవమానించి, భవనం బయటకు తరిమివేయడం అత్యంత అమానుషమైన చర్య అని మండిపడింది.
ఈ ఘోర ఉదంతంపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) స్పందిస్తూ పలు కీలక డిమాండ్లను ముందుకు తెచ్చింది. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత డెలివరీ వర్కర్కు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అలాగే నటుడు అఖిల్ రాజ్, ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులంతా బాధిత కార్మికుడికి, గిగ్ వర్కర్ల సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గిగ్, డెలివరీ కార్మికుల గౌరవం, భద్రతకు పక్కా హామీ ఇచ్చేలా ప్రభుత్వం, యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరింది.ఓ గిగ్ వర్కర్పై దాడి జరగడమంటే శ్రమజీవులైన కార్మికులందరిపై దాడి జరిగినట్టేనని టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో డెలివరీ బాయ్స్పై ఇలాంటి దాడులు పెరిగిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, తాము బాధిత డెలివరీ వర్కర్కు పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, సదరు నటుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధితుడికి తక్షణ న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.




