ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 35 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ రెండో బంతికే అర్ష్దీప్ సింగ్ను సిక్సర్తో పలకరించిన అతను, ఆ తర్వాత మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో కూడా భారీ సిక్సర్లు బాదాడు. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నించి శ్రేయాస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఈ చిన్న ఇన్నింగ్స్తోనే అభిషేక్ శర్మ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారతదేశంలో జరిగిన టీ20 మ్యాచుల్లో 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఆరో బ్యాటర్గా అతను చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 388 సిక్సర్లతో అందరికంటే ముందుండగా.. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాల సరసన ఇప్పుడు అభిషేక్ చేరాడు. కేవలం 153 మ్యాచుల్లోనే అతను 302 సిక్సర్ల మార్కును అందుకోవడం విశేషం.
అభిషేక్ ఇచ్చిన ఊపును హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ కొనసాగించారు. క్లాసెన్ 43 బంతుల్లో 69 పరుగులు చేయగా, కిషన్ 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. పంజాబ్ ఫీల్డర్లు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న వీరిద్దరూ సన్రైజర్స్ స్కోరును 235 పరుగులకు చేర్చారు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, ఫీల్డర్లు క్యాచ్లు వదిలేయడంతో అతని కష్టానికి ఫలితం దక్కలేదు. మొత్తానికి సన్రైజర్స్ బ్యాటర్ల ధాటికి పంజాబ్ బౌలింగ్ తేలిపోయింది.




