బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 13 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అతి పిన్న వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ (రంజీ ట్రోఫీ) ఆడిన రికార్డు సృష్టించిన ఈ కుర్రాడు, ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ద్వారా రూ. 1.10 కోట్లకు అమ్ముడు కావడంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వైభవ్, అండర్-19 టెస్టుల్లో ఆస్ట్రేలియాపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాది తన దూకుడును చాటుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లో బౌలర్లపై ఓ రేంజిలో విరుచుకుపడుతున్నాడు. చిన్న వయసులోనే ఇంతటి పరిణతి, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తుండటంతో అతడిని భారత క్రికెట్ తదుపరి సూపర్స్టార్గా విశ్లేషకులు భావిస్తున్నారు.
బిసిసిఐకి వైభవ్ ఎంపిక ఎందుకు సవాలుగా మారింది..?
ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం 13 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయడంపై బీసీసీఐ తీవ్రంగా యోచిస్తోంది. అయితే.. ఈ ఎంపిక సెలక్టర్లకు ఒక పెద్ద సవాల్గా మారింది.
ప్రస్తుతం జట్టులో అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి అగ్రశ్రేణి ఓపెనర్లు ఉన్నారు. వైభవ్ను జట్టులోకి తీసుకోవాలంటే వీరిలో ఎవరిని తప్పించాలనేది ఇప్పుడు ప్రధాన సమస్య. ఒకవేళ యువ రక్తాన్ని ప్రోత్సహించే క్రమంలో వైభవ్ను బరిలోకి దించితే.. సీనియర్ ఆటగాళ్ల స్థానాల విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read:Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..
మరోవైపు, కెప్టెన్సీ విషయంలోనూ మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా బ్యాటర్గా ఆశించిన స్థాయిలో రాణించని సూర్యకుమార్ యాదవ్ను ఈ పర్యటనకు పక్కన పెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే.. జట్టు పగ్గాలను అభిషేక్ శర్మ లేదా సంజు శాంసన్లకు అప్పగించే వీలుంది. ఐర్లాండ్ చిన్న జట్టు కావడంతో ప్రయోగాలకు ఇది సరైన సమయమని బీసీసీఐ భావిస్తోంది. వైభవ్కు అంతర్జాతీయ అరంగేట్రం కల్పిస్తూనే, జట్టులో సమతుల్యతను కాపాడటం మేనేజ్మెంట్కు ఇప్పుడు కత్తిమీద సాము వంటిదే. ఈ పర్యటన ద్వారా భారత టీ20 భవిష్యత్తుపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం కానుంది.




