హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ విధానం వాహనదారులకు తీవ్ర నరకం చూపిస్తోంది. సరైన ముందస్తు వ్యూహం, ప్రణాళిక లేకుండా వన్ వే అమల్లోకి తేడంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, ప్రజలు గంటల తరబడి రహదారులపైనే చిక్కుకుపోతున్నారు. లేన్ చేంజ్ రూట్లతో పాటు కనెక్టింగ్ రోడ్లలో ట్రాఫిక్ పోలీసులు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. కనెక్టింగ్ రూట్లలో ఏర్పడుతున్న స్తంభన నేరుగా మెయిన్ రోడ్లపై పడటంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది.
ఈ వన్ వే ప్రభావం రోడ్ నెంబర్ 12పై తీవ్రంగా పడింది. మసాబ్ ట్యాంక్ వైపు నుంచి వచ్చే వాహనాలు రోడ్ నెంబర్ 12 వద్ద భారీగా ఇరుక్కుపోతున్నాయి. ప్రతినిత్యం ఆఫీసులకు వెళ్లే క్రమంలో సగం సమయం ఈ నరకప్రాయమైన ట్రాఫిక్లోనే సరిపోతోందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మూడు గంటలకు పైగా ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో బైక్లు అమితంగా హీట్ ఎక్కి, ద్విచక్రవాహనదారులు వాహనాలను పక్కకు నిలిపివేసి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
అత్యవసర సేవలకూ ఈ రోడ్డు ఆంక్షలు తీవ్ర అడ్డంకిగా మారాయి. క్యాన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వైపు వచ్చే రూట్లో ఓ అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ముందుకు వెళ్లడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఈ మార్గమంతా వాహనాలు బంపర్ టు బంపర్ కదులుతున్నాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఒకవైపు పోలీసులు వాహనాలను పూర్తిగా ఆపేస్తుండటంతో తెలంగాణ భవన్ వైపు వెళ్లాలంటే సుదీర్ఘ సమయం వేచి చూడాల్సి వస్తోంది. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చౌరస్తా నుంచి తెలంగాణ భవన్ రూట్ మొత్తం రెండు వైపులా పూర్తిగా జామ్ కావడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. కేవలం ఆఫీసులకు చేరుకోవడానికే రెండు గంటలకు పైగా పడుతుండటంతో ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.




