Pawan Kalyan: గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో మునిగిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీనికోసం డిప్యూటీ సీఎం గ్రౌండ్ లెవల్లోకి వెళ్లి మరీ పని చేస్తున్నారు.. ఇక, గోదావరి పుష్కరాల ముందు కాలుష్య నియంత్రణపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఆరు జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించి వాటిని మురుగురహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గోదావరిలోకి మురుగు నీరు నేరుగా కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీల సామర్థ్యానికి అనుగుణంగా మురుగు శుద్ధి ప్లాంట్లు నిర్మించాలని.. పీసీబీ మంజూరు చేసిన రూ.100 కోట్ల నిధులతో పాటు అవసరమైతే స్వచ్ఛాంధ్ర నిధులను కూడా వినియోగించాలని ఆదేశించారు.
ప్రస్తుతం రోజుకు 104 మిలియన్ లీటర్ల మున్సిపల్ మురుగు, 8.38 మిలియన్ లీటర్ల గ్రామీణ మురుగు గోదావరిలో కలుస్తోందని అధికారులు గుర్తించారు. మరోవైపు ఆంధ్ర పేపర్స్ నుంచే రోజుకు 32 మిలియన్ లీటర్ల పారిశ్రామిక కాలుష్యం విడుదల అవుతుండగా.. 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం కూడా జీవనదిని తీవ్రంగా కలుషితం చేస్తున్నట్టు వెల్లడైంది. పారిశ్రామిక కాలుష్య నివారణకు నిరంతర తనిఖీలు నిర్వహించాలని.. ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24 గంటల ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్కు కంట్రోల్ రూం నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిపారు. స్వచ్ఛమైన గోదావరి జలాల్లో భక్తులు పవిత్ర పుష్కరాలు నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..




