కర్ణాటక రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన పక్కా సోషలిస్ట్, ప్రజాకర్షక నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం కేవలం ఒక వ్యక్తి పదవీ విరమణ కాదు.. అది ఒక సుదీర్ఘ రాజకీయ సిద్ధాంతం, సామాజిక సమీకరణాల సమ్మేళనం పక్కకు తప్పుకోవడం. 1970, 80ల నాటి యాంటీ-కాంగ్రెస్ జనతా ఉద్యమం నుంచి ఉద్భవించిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి సమకాలీన నేతల తరం లోని చివరి తరం నేత సిద్ధరామయ్య. తీవ్రమైన సంక్షోభాలు, అంతర్గత కలహాలు, ఎదురుదెబ్బల మధ్య కూడా ఫీనిక్స్ పక్షిలా పైకి లేచిన ఆయన రాజకీయ ప్రస్థానాన్ని విశ్లేషిస్తే.. ఆయన నిష్క్రమణ కర్ణాటక రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
‘అరాచకత్వమే’ ఆయన ఆయుధం..
సిద్ధరామయ్య రాజకీయ శైలి ఎప్పుడూ ఒకే సూత్రంపై నడిచింది: “నన్ను కాదని మీరు పార్టీని నడపలేరు.” 2005లో హెచ్.డి.దేవెగౌడతో విభేదించి జేడీఎస్ (JD-S) నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడూ ఒక ‘వలస నాయకుడి’గానే చూసింది. కానీ.. 2013లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, మల్లికార్జున ఖర్గే వంటి పార్టీ విధేయుడిని పక్కనపెట్టి సిద్ధరామయ్యే సీఎం కావాల్సి వచ్చింది. దానికి కారణం ఆయనకు ఉన్న ఎమ్మెల్యేల బలం, ఆయనను కాదంటే పార్టీ ముక్కలైపోతుందనే హైకమాండ్ భయం. ఐదేళ్లపాటు పూర్తి కాలం సీఎంగా ఉండి కర్ణాటకలో అరుదైన రికార్డు సృష్టించారు.
2018లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ ఆయన పట్టు సడలలేదు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించలేదు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఆ కూటమి కుప్పకూలడం వెనుక సిద్ధరామయ్య వ్యూహం ఉందనేది బహిరంగ రహస్యం. ఆయన విధేయులైన ఎమ్మెల్యేల రాజీనామాలే ఆ తర్వాత బి.ఎస్. యడ్యూరప్ప సీఎం కావడానికి మార్గం సుగమం చేశాయి. ఇక 2023లో కాంగ్రెస్ చారిత్రాత్మక మెజారిటీతో గెలిచినప్పుడు కూడా అదే ‘పొలిటికల్ లాజిక్’ పనిచేసింది. సిద్ధరామయ్యను కాదని డీకే శివకుమార్కు పదవి ఇస్తే పార్టీలో తీవ్ర అరాచకం సృష్టిస్తారని తెలిసి రాహుల్ గాంధీ మద్దతుతో ఆయన మళ్లీ సీఎం పీఠాన్ని అధిరోహించారు.
డీకే శివకుమార్ సవాల్..
అయితే, 2013 నాటి సిద్ధరామయ్యకు, 2023 నాటి సిద్ధరామయ్యకు మధ్య చాలా తేడా ఉంది. ఈసారి ఆయనకు డీకే శివకుమార్ (DKS) రూపంలో అత్యంత శక్తివంతమైన, పట్టుదల కలిగిన ప్రత్యర్థి ఎదురయ్యాడు. పార్టీ పాత తరం నేతలంతా డీకే వెనుక నిలబడటంతో, ముందస్తు ఒప్పందం ప్రకారం మధ్యంతర నాయకత్వ మార్పిడికి సిద్ధరామయ్య ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆయన మొదటి విడత పాలన సంక్షేమ పథకాలతో వెలిగిపోతే, గత మూడేళ్ల రెండో విడత పాలన మాత్రం పూర్తిగా నిరాశాజనకంగా సాగింది.
సీఎం చుట్టూ చేరిన ఒక చిన్న కోటరీ (ముఠా) కారణంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆయన అందుబాటులో లేకుండా పోయారు. ప్రభుత్వంపై వరుసగా వచ్చిన అవినీతి ఆరోపణలు, అంతర్గత అధికార పోరాటాలు సిద్ధరామయ్య ‘అవినీతి రహిత’ ఇమేజ్ను దెబ్బతీశాయి. ఒకప్పుడు ఆయనొక అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అని పొగిడిన సొంత మంత్రులే, ఇటీవల కాలంలో అంతా అధోగతి పాలైంది అని వాపోయే పరిస్థితి వచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. పార్టీ ప్రతిష్ట మరింత దిగజారకముందే హైకమాండ్ ఆయనపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించింది. సాధారణంగా ఎలాంటి పోరాటం లేకుండా లొంగిపోని సిద్ధరామయ్య, ఈసారి సైలెంట్గా తప్పుకున్నారంటేనే ఆయనకు కూడా పరిస్థితి చేయి దాటిందని అర్థమైంది.
సోషలిస్ట్ శకం ముగింపు..
సిద్ధరామయ్య నిష్క్రమణ కర్ణాటకలోని సామాజిక సమీకరణాలను పూర్తిగా మార్చేయనుంది. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీల సామాజిక కూటమికి ఒక ఫేస్. గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును శాసిస్తున్నది ఈ సమీకరణమే. ఇప్పుడు సిద్ధరామయ్య లేని కాంగ్రెస్ ఆ ఓటు బ్యాంకును ఎలా కాపాడుకుంటుంది అనేది పెద్ద ప్రశ్న.
హైకమాండ్ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి జాతీయ రాజకీయాల్లోకి లాగాలని చూస్తున్నప్పటికీ, బెంగళూరును వదిలి వెళ్లడానికి ఆయన సిద్ధంగా లేరు. సిద్ధరామయ్య వంటి మాస్ లీడర్ అధికారంలో లేకపోయినా శాసనసభలో ఉంటే, అది కొత్తగా వచ్చే ముఖ్యమంత్రికి నిరంతరం ఒక కత్తి మీద సాము లాంటిదే. ఆయన ఎప్పుడూ తెరవెనుక ప్రశాంతంగా కూర్చునే పెద్దమనిషి కాదు.. రాజకీయ శూన్యతను, గందరగోళాన్ని ఉపయోగించుకుని మళ్లీ పుంజుకునే స్వభావం ఆయనది.
2004 నుంచి కర్ణాటక రాజకీయాలను శాసించిన త్రిమూర్తులు యడ్యూరప్ప, సిద్ధరామయ్య, కుమారస్వామిలలో సిద్ధరామయ్య నిష్క్రమణతో ఒక ప్రధాన అధ్యాయం ముగిసింది. అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్కు కేరాఫ్ అడ్రస్గా ఉన్న కర్ణాటకలో, ఈ ‘లాస్ట్ సోషలిస్ట్ వార్ హార్స్’ రాజీనామా తర్వాత ఎలాంటి సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తాయో చూడాలి.




