Hyderabad: హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీసులకు నేపాలి గ్యాంగ్లు తలనొప్పిగా మారాయి. దోపిడిలు, హత్య చేసిన కేసుల్లో నేపాలీలు ఇంకా చిక్కలేదు. రెండు నేపాలీ గ్యాంగ్లు పకడ్బందీ, పక్కా ప్లాన్లతో దోపిడీ చేసి పారిపోయాయి. సీసీ కెమెరాలు చిక్కకుండా, పోలీసులు దర్యాప్తునకు అందకుండా చెక్కేశాయి. జూబ్లీహిల్స్ కేసులో నలుగురు నేపాలీలు పరారీలో ఉన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిమనిషిగా చేరి హత్య, దోపిడీకి పాల్పడ్డ కల్పన అండ్ గ్యాంగ్ జాడే లేదు. రెక్కి నిర్వహించి మరి, సీసీ కెమెరాలుకు చిక్కకుండా పక్కా ప్లాన్తో తప్పించుకున్నారు. మరోవైపు.. జవహర్నగర్ పోలీస్ స్టేషన్ కేసులో ఏడుగురు నేపాలీలు పరారీలో ఉన్నారు. నేపాలీ దంపతులు సుబీనా, రాజేశ్ ప్రొఫెసర్ మురళీమోహన్, డాక్టర్ విజయలక్ష్మి ఇంట్లో పనిమనుషులుగా చేరారు. మరో ఐదుగురు నేపాలీలతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీకి స్కెచ్ వేశారు. పనిమనుషులుగా చేరిన ఇరువై రోజుల్లోనే పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేసి పారిపోయారు.
ప్రొఫెసర్ మురళీమోహన్కు మత్తుమందు ఇచ్చి, డాక్టర్ విజయలక్ష్మిని బెదిరించి దోపిడీ చేశారు. 15 గంటల తరువాత విజయలక్ష్మి అరుపులతో స్థానికులు అలర్ట్ అయ్యారు. డోర్ తెరిచి వాళ్లను కాపాడారు. దీంతో దోపిడీ చేసి పారిపోయిన 15 గంటల తరువాత పోలీసులకు సమాచారం అందింది. పోలీసులకు సమాచారం తెలిసే లోపు 15 గంటల్లో తాపీగా పారిపోయారు రాజేశ్, సబీనా, మమత, మరో నలుగురు నేపాలీలు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఈ దోపిడీకి పాల్పడ్డ మమత పాత నేరస్తురాలిగా పోలీసులు గుర్తించారు. మొయినాబాద్ పీఎస్ పరిధిలో జరిగిన దోపిడీ కేసులో జైలుకు వెళ్లి వచ్చింది. ఇక, రెండు కమిషనరేట్ల పరిధిలో జరిగిన రెండు దోపిడీ కేసులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ప్రత్యేక ఆపరేషన్స్ చేపట్టాయి.




