Bangladesh: భారత్-బంగ్లాదేశ్ మధ్య కంచె వేయడానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు భూమిని అప్పగిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ను బాగా కలవరపెడుతున్నట్లు అర్థమవుతోంది. భూమి అప్పగింత ప్రక్రియను సోమవారం అధికారికంగా ప్రకటించారు. రాబోయే 45 రోజుల్లో పూర్తవుతుందని బెంగాల్ సీఎం సువేందు చెప్పారు.
అయితే, ఈ ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘‘ముళ్ల తీగలకు భయపడబోము’’ అని ఆ దేశం చెప్పింది. సరిహద్దులో హత్యలు కొనసాగితే తాము మౌనంగా ఉండబోమని బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మన్ విదేశీ సలహాదారు ఎం హుమాయున్ కబీర్ అన్నారు. సరిహద్దులో కంచె వేయడంపై బంగ్లా ప్రజలు, ప్రభుత్వం భయపడటం లేదని, జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైతే గళం విప్పుతామని ఆయన అన్నారు. ‘‘బంగ్లాదేశ్ ముళ్ల కంచెకు భయపడదు. మాట్లాడాల్సిన చోట మాట్లాడుతాము’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని భారత్ కోరుకుంటే సరిహద్దు భద్రతా సమస్యలపై మరింత మానవతా దృక్పథాన్ని అవలంబించాల్సి ఉంటుందని చెప్పారు. బెంగాల్ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికల ప్రసంగాలు, పరిపాలన రెండూ వేర్వేరు అని కబీర్ అన్నారు. బెంగాల్లోని కొత్త ప్రభుత్వం తన రాజకీయ ప్రసంగాలను ప్రభుత్వ విధానాలుగా మారుస్తుందో లేదో బంగ్లాదేశ్ గమనిస్తూ ఉంటుందని చెప్పారు. సరిహద్దు వద్ద హత్యలు కొనసాగితే తాము మౌనంగా ఉండబోమని బంగ్లా హెచ్చరించింది. సరిహద్దు వద్ద పరిస్థితి ఎప్పటికీ మునుపటిలా ఉండబోమని అన్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సువేందు అధికారి తొలిసారి క్యాబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలోనే సరిహద్దు కంచె నిర్మాణాన్ని ప్రకటించారు. సరిహద్దు వెంబడి ఉన్న భూమిని బీఎస్ఎఫ్కు అప్పగిస్తామని ఆయన తెలిపారు. గతంలో మమతా బెనర్జీ సర్కార్ సరిహద్దును బుజ్జగింపు రాజకీయాల కోసం తెరిచి ఉంచిందని, చొరబాటుదారులు స్వే్చ్ఛగా దేశంలో ప్రవేశించే వీలు కల్పించిందని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల హామీల్లో కంచె నిర్మాణం కూడా ప్రధానంగా ఉంది. ప
శ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్తో 4,097 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ప్రాంతంలో సుమారు 3,240 కిలోమీటర్ల మేర ఇప్పటికే కంచె వేయబడింది, కాగా దాదాపు 850 కిలోమీటర్ల మేర కంచె వేయకుండా ఉంది. 175 కిలోమీటర్ల మేర కంచె వేయడం అత్యంత కష్టమైందిగా భావిస్తున్నారు. బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అనేక నదులు ప్రవవిస్తుండటం, నేల చిత్తడి ఉండటం కంచె నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్నాయి.




