దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. రెండో రోజు కూడా వరుస నష్టాలను చవిచూసింది. ఈ వారం ప్రారంభం నుంచి మార్కెట్ భారీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో సోమవారం దేశీయ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అయింది. ఇక మంగళవారం కూడా అంతకంటే ఘోరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఉదయం మార్కెట్ ప్రారంభం అయిన దగ్గర నుంచి నష్టాల్లోనే ట్రేడ్ అయింది. దీంతో రూ.12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 1,456 పాయింట్లు నష్టపోయి 74, 559 దగ్గర ముగియగా.. నిఫ్టీ 436 పాయింట్లు నష్టపోయి 23, 379 దగ్గర ముగిసింది. ఇక రూపాయి విలువ సరికొత్త రికార్డ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 95.63 దగ్గర సరికొత్త రికార్డ్ స్థాయి దగ్గర ముగిసింది.
పశ్చిమాసియాలో ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగకపోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ఇంకోవైపు రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోవడం.. తాజాగా ప్రధాని మోడీ దేశ ప్రజలను పొదుపు మంత్రం పాటించాలని సూచించడం ఇవన్నీ కూడా మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది. నిలకడలేని పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారుల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో మార్కెట్ భారీ నష్టాలను ఎదుర్కొంటోంది.
ఎన్ఎస్ఈలోని మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ బ్యాంకుల రంగాలను మినహాయించి మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టీలో రియల్టీ, ఐటీ స్టాక్స్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉండగా నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 3 శాతానికి పైగా పడిపోయింది.




