తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు వారసత్వ ప్రదేశాలను ఒక్క రోజులోనే సందర్శించే అవకాశం కల్పిస్తూ తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSTDC) ప్రత్యేక హెరిటేజ్ అండ్ పిల్గ్రిమేజ్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్లో ఒకే టికెట్తో ఐదు ప్రముఖ ప్రాంతాలను సందర్శించవచ్చు. మరి ఈ ప్లాన్ డీటెయిల్స్ ఏంటో చూసేద్దామా..
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం:
ఈ టూర్ హైదరాబాద్ నుంచి ఏసీ కోచ్ బస్సులో ప్రారంభమవుతుంది. తొలి గమ్యస్థానంగా యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. కొండపై వెలసిన ఈ ప్రసిద్ధ ఆలయంలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు. అనంతరం హరిత హోటల్లో అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తారు.
శిల్పరామంలో కళా వైభవం:
యాదాద్రి దర్శనం అనంతరం టూర్ శిల్పరామంకు చేరుకుంటుంది. ఇక్కడ చేతి వృత్తుల కళాఖండాలు, సాంప్రదాయ వస్తువులు, జానపద సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. తెలంగాణ కళా సంపదను దగ్గరగా చూసే అవకాశం ఇక్కడ లభిస్తుంది.
కొలనుపాక జైన్ ఆలయం:
తదుపరి గమ్యస్థానం చారిత్రక ప్రాధాన్యం కలిగిన కొలనుపాక జైన్ ఆలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతను ఆస్వాదించవచ్చు.
స్వర్ణగిరి ఆలయం:
టూర్లో భాగంగా స్వర్ణగిరి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. ఇటీవలి కాలంలో భక్తుల ఆదరణ పొందుతున్న ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఆలయ పరిసరాల అందాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
భూదాన్ పొచ్చంపల్లిలో షాపింగ్:
చివరి గమ్యస్థానంగా ప్రపంచ ప్రఖ్యాత భూదాన్ పొచ్చంపల్లిని సందర్శిస్తారు. ఇకట్ చేతి నేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో స్థానికంగా తయారయ్యే చీరలు, దుస్తులు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ హస్తకళల ప్రత్యేకతను ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు.
ప్యాకేజీలో లభించే సౌకర్యాలు:
ఈ టూర్ ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి 21 సీట్ల సామర్థ్యం కలిగిన ఏసీ కోచ్లో నిర్వహించబడుతుంది. ప్రయాణంతో పాటు భోజన సదుపాయం, ఆలయ దర్శనాలు మరియు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లు టూర్ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్ లేదా TSTDC కార్యాలయాలను సంప్రదించవచ్చు.
ప్యాకేజీ ధరలు:
పెద్దలకు: రూ. 2,070/-
పిల్లలకు: రూ.1,770/-
ప్యాకేజీలో ఏం వస్తాయి?
AC మినీ బస్ ప్రయాణం
ఉదయం టిఫిన్ (యాదాద్రి హరిత)
మధ్యాహ్నం వెజ్ లంచ్ (వివేరా హోటల్)
సాయంత్రం హై-టీ (పోచంపల్లి)
అన్ని ఆలయాల దర్శనం
బుకింగ్ నంబర్లు: 98481 25720 / 83672 85285
వెబ్ సైట్: tgtdc.in/package/yadagirigutta-swarnagiri




