ఆ చిన్నారికి రెండేళ్లకే నూరేళ్లూ నిండిపోయాయి. కన్న తండ్రి ఘాతుకానికి బలైంది. భార్య మీద ఉన్న కోపాన్ని కూతురి మీద చూపించాడు ఆ కసాయి తండ్రి. అప్యాయంగా తండ్రి ఇచ్చిన పండు తిని.. ఆ చిన్నారి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ తర్వాత తండ్రి కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. భార్య, భర్త మధ్య విభేదాలు పిల్లల ఉసురు తీస్తున్న అంశానికి ఈ ఘటన మరో మచ్చు తునకగా మారింది.
ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ముద్దులొలికే ఈ అమ్మాయి పేరు మేఘన. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మ గూడెం గ్రామానికి చెందిన వరికుప్పల రవి, స్వాతి దంపతుల గారాలపట్టి. ఈ అమ్మాయికి ప్రస్తుతం రెండేళ్లు. ఇటీవలే రెండో పుట్టిన రోజు జరుపుకొంది. కానీ తల్లిదండ్రుల మధ్య విభేదాలు.. కోపతాపాలు ఆ చిన్నారి ఉసురు తీశాయి.
సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మ గూడెంకి చెందిన వరికుప్పల రవికి మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన స్వాతితో వివాహం జరిగింది. రవి ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. వారికి మేఘన అనే రెండేళ్లు కూతురు, మయూరి అనే 9 నెలల కూతురు ఉన్నారు. భార్యాభర్తల మధ్య అనుమానం పెనుభూతమై 6 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య సర్దిచెప్పేందుకు ఇరు కుటుంబాల పెద్దలు అన్ని ప్రయత్నాలు చేశారు. గొడవలతో విసిగి వేసారిన స్వాతి.. 3 నెలల క్రితం స్వాతి చిన్న కుమార్తె మయూరిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. రెండేళ్ల మేఘన మాత్రం తండ్రి వద్దే ఉంటుంది. పెద్ద కుమార్తెను కూడా తన వద్దకు పంపించాలని స్వాతి పెద్దల సహాయంతో భర్తను, అత్తా, మామలను కోరింది. భార్య ప్రతిపాదనను రవి వినకపోవడంతో… స్వాతి మాడ్గుల పోలీస్ స్టేషన్లో తన పెద్ద కూతురు కొసం భర్తపై ఫిర్యాదు చేసింది. స్వాతి ఫిర్యాదుతో అక్కడి పోలీసులు సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని ఇరు కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పరువు పోయిందనే బాధ కావచ్చు.. లేక కూతురు దూరమవుతుందనే బాధ కావచ్చు.. రవి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అవసరమైతే కూతురును చంపుకుంటాను కానీ .. తల్లికి ఇవ్వవద్దనుకున్నాడు. అంతే.. ఆ చిన్నారికి సపోటా పండులో ఎలుకల మందు కలిపి కూతురుకు ఇచ్చాడు. నాన్న పండు తెచ్చాడాని సంతోషంతో తిన్న ఆ చిన్నారి… కొద్దిసేపటికే వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అదే క్రమంలో రవి కూడా ముందస్తు ప్లాన్ ప్రకారం నిద్రమాత్రలతోపాటు ఎలుకల మందు తాగే నీళ్లలో కలుపుకుని తాగాడు. కొద్దిసేపటి తర్వాత రవి కూడా వాంతులు చేసుకుంటుండంతో కుటుంబ సభ్యులు గమనించి నిలదీయడంతో కూతురుకు సపోటా పండులో ఎలుకల మందు పెట్టి తినిపించిన విషయం చెప్పాడు. తాను ఎలుకల మందు తాగిన విషయం చెప్పేశాడు. రవిని వెంటనే నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి, మేఘనను హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మేఘన మృతి చెందింది.
మరోవైపు రవి తనను వేధించాడని.. అదనపు కట్నం కోసం అత్త మామలు, ఆడపడుచులతో కలసి వేధించారని… ఆ వేధింపులు భరించలేకనే తను చిన్న కూతురితో పుట్టింటికి వెళ్లిపోయానని.. స్వాతి చెబుతోంది. పెద్ద కూతురుని కూడా తన వద్దకు తీసుకొచ్చేందుకు పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. ఇంతలోనే ఈ ఘటన జరిగిందని స్వాతి కన్నీటి పర్యంతమైంది.
మరోవైపు రవి తండ్రి భిన్న వాదన వినిపించారు. స్వాతి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని… ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. రవి నిలదీయడంతో స్వాతి పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా.. తండ్రి రవి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం స్వాతి ఇచ్చిన ఫిర్యాదు వరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




