ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్ (GT) తో అహ్మదాబాద్లో జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డుకెక్కింది.
అతని కెరీర్లో ఇంతకుముందు 2018లో రాజస్థాన్ రాయల్స్పై 26 బంతుల్లో, అదే ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్పై 26 బంతుల్లో, అలాగే 2025లో లక్నో సూపర్ జెయింట్స్పై 27 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ తిరగరాస్తూ 25 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. కేవలం తన కెరీర్లోనే కాకుండా, ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో కూడా అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల అరుదైన జాబితాలో కోహ్లీ చేరిపోయాడు.
ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో సురేష్ రైనా (2010), డేవిడ్ వార్నర్ (2016), వెంకటేష్ అయ్యర్ (2024) 24 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసి అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (2015), క్రిస్ గేల్ (2016) లతో పాటు ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వారి సరసన నిలిచాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి క్రీజులో నాటౌట్గా ఉన్నాడు. అతని ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆర్సీబీ జట్టును విజయానికి మరింత చేరవ చేసింది.




