US-Iran Talks: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు శనివారం నుంచి జరగబోతున్నాయి. అయితే, చర్చలకు కొన్ని గంటల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ముందుగా కొన్ని తమ షరతులు నెరవేర్చితేనే చర్చల్లో పాల్గొంటామని ప్రకటించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. కాల్పుల విరణమను లెబనాన్కు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ ఆస్తుల్ని వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. అయితే, ఈ రెండు షరతులు నెరవేరితేనే చర్చలు ప్రారంభమవుతాయని అన్నారు.
ఈ కాల్పుల విరణమ ఒప్పందంలో లెబనాన్ను చేర్చాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అన్నారు. లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు ఆగాలని డిమాండ్ చేశారు. లెబనాన్ కూడా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగమని చెప్పారు. ఇజ్రాయిల్ దాడులు ఆగకుంటే మొత్తం శాంతి ప్రక్రియ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్కు బయలుదేరారు. మరోవైపు, ఇరాన్ నుంచి ప్రతినిధి బృందం ఇంకా పాకిస్తాన్ వెళ్లకపోవడం గమనార్హం.
చర్చల ప్రక్రియ ముందు కఠినమైన డిమాండ్లను ఇరాన్ తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ బ్యాంకింగ్, ఇంధర రంగాలపై అమెరికా ఆంక్షల కారణంగా చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారా వచ్చిన బిలియన్ డాలర్లను ఇరాన్ పొందలేకపోయింది. ఇప్పుడు వాటిని చర్చలకు ముందే రిలీజ్ చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. లేదంటే చర్చలు జరుగవని తేల్చి చెబుతోంది. మరోవైపు, పాక్ లో జరిగే చర్చలకు ఇరాన్ ప్రభుత్వంలోని ఒక వర్గం వెళ్లాలని భావిస్తుంటే, మరో వర్గం లెబనాన్పై దాడులు ఆగితేనే చర్చల ప్రక్రియ ముందుకు వెళ్తుందని చెబుతోంది. దీంతో ఇరాన్ ప్రభుత్వంలోనే చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడింది.




