ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. ఈ మేరకు ఉగ్రవాదులది పిరికిపంద చర్య, ఈ హింసను ఖండిస్తున్నామన్నారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తాం.. దేశ భద్రతను కాపాడే విషయంలో మోడీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుంది.. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తుందని తేల్చి చెప్పారు. ఇక, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీతో చెప్పినట్లు పేర్కొన్నారు. పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. ఇక, మే 2వ తేదీన చేపట్టే రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభానికి ప్రధాని మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానికి వివరించాం.. దీనిపై స్పందించిన ప్రధాని, రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు కీలక సూచనలు చేశారు.
మోడీ, చంద్రబాబు సారథ్యంలో పిఠాపురం అభివృద్ధిలో దూసుకుపోతుంది..
పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఏపీ ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడం అని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు చేస్తే యాక్షన్ తీసుకుంటాం అని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సారథ్యంలో పిఠాపురం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేశాం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నాం అని వెల్లడించారు.
రాష్ట్రం అంటే అమరావతి అన్నట్లుగా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు..
కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చారు.. గత జగన్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని ప్రచారం చేశారు.. కలెక్టర్ కార్యాలయాలు కూడా తనఖా పెట్టి అప్పులు చేస్తున్నారని నానా యాగీ చేశారు.. ఇప్పుడు, చంద్రబాబును జాకీలు పెట్టి లేపారు.. ప్రపంచ ఆర్థిక వేత్తలకు కూడా చంద్రబాబు పాఠాలు చెబుతారని చెప్పారు.. చంద్రబాబును సీఎంని చేస్తే ఆయన సంపద సృష్టిస్తారు.. జగన్ చేసిన అప్పులు కూడా తీరుస్తారని డబ్బాలు కొట్టారు.. ఆయనకు వత్తాసు పలికే పవన్ మాటలు నమ్మి ప్రజలు ఓటేశారు.. ఇప్పుడు తలకు మించిన అప్పులు చేస్తున్నారు అని పేర్ని నాని తెలిపారు.
కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన జరపాలని సుప్రీం ఆదేశం..
కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ జరపాలని “కేంద్ర సాధికార కమిటీ”కి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొల్లేరులో ప్రైవేటు భూములను నోటిఫై చేయడంపై సుప్రీంకోర్టును ప్రైవేటు మత్స్యకారులు సంఘం ఆశ్రయించిన విషయం విధితమే. ఇక, కొల్లేరు ప్రస్తుత స్థితిపై నివేదిక అందించాలని “సీఈసీ” కి ఆదేశాలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను “ఏపీ వెట్ ల్యాండ్ స్టేట్ అథారిటీ” సరిగ్గా అమలు చేస్తుందో, లేదో నివేదిక ఇవ్వాలి అని జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం సూచించింది. అయితే, కొల్లేరు సరిహద్దులను పరిశీలించాలి అని “నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు స్టాండింగ్ కమిటీ” తీర్మానాలను, కొల్లేరు సరిహద్దులపై ఆర్ సుకుమార్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి సమస్యను పరిష్కరించాలి అని సుప్రీంకోర్టు తెలిపింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టంకు అనుగుణంగానే కొల్లేరులో వన్యప్రాణుల అభయారణ్యం నోటిఫై చేశారా? అని ప్రశ్నించింది. కొల్లేరులో ఉన్న ప్రైవేటు భూ యజమానుల హక్కులను ఎలా సెటిల్ చేశారు? అని అడిగింది. దీనిపై 12 వారాల్లోగా సుప్రీంకోర్టుకు తుది నివేదికను అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది.
కేంద్రం చర్యలకు మద్దతుగా నిలబడాలి.. తీవ్రవాదాన్ని అంతమొందించాలి
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ముక్తకంఠంతో నినదిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాక్ పై దౌత్యపరమైన దాడికి తెరలేపింది. దేశం మొత్తం పాక్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. ముష్కరుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్గౌడ్, ఒవైసీ, మంత్రులు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్, ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పర్యాటకులపై దాడి చేసి చంపడం తీవ్రమైన ఘటన.. అందరం ఒక్కటై తీవ్రవాదంపై పోరాడాలి.. భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇది.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.. దాడులకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్పాలి.. పార్టీలకు అతీతంగా పని చేయాలి.. తీవ్రవాదాన్ని అంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రెవెన్యూ మంత్రి పేరిట వసూళ్లు.. ఇద్దరు అరెస్టు.. మంత్రి పొంగులేటి హెచ్చరిక
ఈజీమనీకి అలవాటు పడి సైబర్ మోసాలకు పాల్పడే వారు కొందరైతే.. మరికొందరేమో పొలిటికల్ లీడర్స్ ను అడ్డం పెట్టుకుని సంపాదించాలని చూస్తుంటారు. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకాల్సిందే కదా.. ఇదే రీతిలో ఇద్దరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డీ పర్సనల్ అసిస్టెంట్స్ మంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. చివరికి వీరి బాగోతం బట్టబయలు కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ ( పిఎ) ల మని చెప్పి అమాయకులను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి ( వయస్సు 34), మచ్చ సురేష్ ( వయస్సు 30) హైదరాబాద్ నాగోల్లో నివాసముంటున్నారు. వీరు మంత్రిగారి పీఏలమంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రిగారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాదులో ఉన్న పాకిస్థానీయులకు డీజీపీ జితేందర్ వార్నింగ్.. నగరాన్ని వదిలి వెళ్లిపోవాలి
పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై దౌత్య దాడికి పూనుకుంది. సిందూ జలాల ఒప్పందం, వీసాల రద్దు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలర్ట్ చేసింది. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వీసాలు రద్దు చేసి వెనక్కి పంపించాలని కేంద్రం ఆదేశించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాదులో 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించింది. డీజీపీ జితేందర్ రెడ్డి నగరంలో ఉన్న పాకిస్థానీయులకు వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాదులో ఉన్న పాకిస్థానీయుల వీసాలు మొత్తం రద్దయ్యాయని తెలిపారు. 27వ తేదీలోగా పాకిస్థానీయులు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు అటారి వాఘ సరిహద్దు బోర్డర్ ఓపెన్ చేసి ఉంటుందని వెల్లడించారు. గడువు ముగిసిన తర్వాత పాకిస్థానీయులు ఎవరున్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాదులో ఉన్న పాకిస్తానీల పైన నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాదులో ఎక్కడెక్కడ పాకిస్థానీయులు ఉన్నారో ట్రాకింగ్ చేస్తున్నామని తెలిపారు.
“పాకిస్తాన్ జెండా మిస్సింగ్”.. ‘‘సిమ్లా ఒప్పందం’’ టేబుల్పై కనిపించని జెండా..
పహల్గామ్ ఉగ్రదాడి, ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ -పాక్ మధ్య 1972లో ‘‘సిమ్లా ఒప్పందం’’ జరిగిన చారిత్రాత్మక టేబుల్పై ‘‘పాకిస్తాన్ జెండా’’ కనిపించకుండా పోయింది. భారత్, పాక్తో సంబంధాలను నిలిపేసిన ఒక రోజు తర్వాత ఈ విషయం జరిగింది. మంగళవారం, పహల్గామ్లో 26 మంది అమాయకపు టూరిస్టులను లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ కిరాతకంగా చంపేసింది. ఇప్పటికే, భారత్ పాక్పై దౌత్య యుద్ధం మొదలుపెట్టింది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దుతో పాటు పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ ‘‘సిమ్లా ఒప్పందం’’తో పాటు భారత్తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేసింది. పాక్ నిర్ణయం తీసుకున్న ఒక రోజు తర్వాత ‘‘పాకిస్తాన్ జెండా’’ విషయం వెలుగులోకి వచ్చింది.
“మతం ఆధారంగా ప్రజల్ని చంపుతారా..?” హిందువులు ఇలా ఎప్పుడూ చేయరు..
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడితో భారతదేశం ఆగ్రహంతో ఉంది. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమార్చారు. ముఖ్యంగా, మతం ఆధారంగా ఉగ్రవాదులు హిందువుల్ని టార్గెట్ చేసి మరీ చంపారు. కల్మా చదవమని, చదవని వారిని వెతికి మరీ పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపారు. హిందువులను ఊచకోత కోశారు. అయితే, ఈ ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ‘‘ఉగ్రవాదులు మతం గురించి అడిగిన తర్వాత ప్రజల్ని చంపారు. హిందువులు ఎప్పటికీ అలా చేయరు’’ అని ఆయన గురువారం అన్నారు. ‘‘యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య ఉంది. మా హృదయాల్లో బాధ ఉంది, కోపంగా ఉన్నాము. చెడును నాశనం చేయడానికి బలాన్ని చూపించాలి. రావణుడు కూడా తన బుద్ధిని మార్చుకోవడానికి నిరాకరించాడు, అతడికి మంచిగా మారాలని రాముడు సమయం ఇచ్చాడు. ఆ తర్వాతే అతడిని సంహరించాడు’’ అని అన్నారు.
‘‘మోడీ మీ శ్వాస ఆపేస్తాం’’.. ఉగ్రవాది హఫీజ్ సయీద్ వార్నింగ్.. వీడియో వైరల్..
లష్కరే తోయిబా చీఫ్, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సింధు నది జలాల ఒప్పందం రద్దు గురించి ఉగ్రవాది మాట్లాడిన వీడియోని ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కావాలని వైరల్ చేస్తోంది. పాక్ ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వీడియోలో సయీద్ భారత్ ప్రభుత్వాన్ని , ప్రధాని నరేంద్రమోడీని బెదిరించే ప్రయత్నం చేశాడు. ప్రధాని మోడీని బెదిరిస్తూ ‘‘ మీరు పాకిస్తాన్కి నీళ్లు ఆపేస్తే, మేము మీ శ్వాసను ఆపేస్తాము. నదుల్లో రక్తం ప్రవహిస్తుంది’’ అని హఫీజ్ సయీద్ వీడియోలో చెబుతుండటం చూడవచ్చు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 26 మంది అమాయక టూరిస్టుల్ని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనపై యావత్ భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే భారత్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ రద్దు చేసింది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది, అట్టారీ-వాఘా బోర్డర్ని క్లోజ్ చేసింది. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో, ఈ ఉగ్రవాది పాత వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
‘‘ఉగ్ర వేటలో భారత్కి అమెరికా అండ’’.. యూఎస్ స్పై చీఫ్ తులసీ గబ్బర్డ్..
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర ఘటనపై యావత్ ప్రపంచం భారత్కి అండగా నిలుస్తుంది. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది అమాయకపు టూరిస్టులను కిరాతకంగా కాల్చి చంపారు. మతం ఆధారంగా, హిందువుల్ని టార్గెట్ చేసి హత్య చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే, ప్రపంచ దేశాల నాయకులు, ప్రధాని మోడీకి ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ఉగ్రవాద అణిచివేతలో తాము భారత్కి అండగా నిలబడుతామని చెప్పారు. తాజాగా, అమెరికా గూఢచార సంస్థల అధినేత తులసీ గబ్బర్డ్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల వేటలో భారత్కి అండగా ఉంటామని చెప్పారు. శుక్రవారం తులసీ ఇస్లామిక్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, నేరస్తుల్ని వేటాడేటప్పుడు అమెరికా భారత్కి మద్దతు ఇస్తుందని అన్నారు. ‘‘పహల్గామ్లో 26 మంది హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన భయంకరమైన ఇస్లామిక్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో మేము భారతదేశానికి సంఘీభావం తెలియజేస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరియు భారతదేశ ప్రజలందరికీ నా న సానుభూతి. ఈ దారుణమైన దాడికి కారణమైన వారిని మీరు వేటాడేటప్పుడు మేము మీతో ఉన్నాము మరియు మీకు మద్దతు ఇస్తున్నాము’’ అని ట్వీట్ చేశారు.