TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం మరింత ముదిరింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ఫిర్హాద్ హకీమ్ కోల్కతా మేయర్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటు, రీటబ్రత బెనర్జీ రూపంలో ధిక్కారం ఎదుర్కొంటున్న మమతకు ఇది మరింత షాక్ ఇచ్చే పరిణామం. టీఎంసీలో పెరుగుతున్న అనిశ్చితి, వరసగా కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC)లో పార్టీ కౌన్సిలర్ల రాజీనామా నేపథ్యంలో మేయర్ పదవికి ఫిర్హాద్ హకీమ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
టీఎంసీ ఓటమి తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ లోక్సభ సభ్యుడు అయిన అభిషేక్ బెనర్జీ, సోవన్దేబ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగా, నైనా బందోపాధ్యాయ మరియు అసిమా పాత్రాను ప్రతిపక్ష ఉప నాయకులుగా, మరియు ఫిర్హాద్ హకీమ్ను అసెంబ్లీలోని తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ పక్ష చీఫ్ విప్గా పేర్కొంటూ స్పీకర్ కార్యాలయానికి ఒక లేఖ పంపారు. దీంతోనే పార్టీలో తిరుగుబాటు మొదలైంది.
ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో టీఎంసీ ఎమ్మెల్యే రీటబ్రత బెనర్జీని బహిష్కరించింది. ఇప్పుడు ఈ బహిష్కరించిన రీటబ్రత నేతృత్వంలోని టీఎంసీ రెబల్ వర్గం తిరుగుబాటు చేసింది. తాజాగా, 58 మంది ఎమ్మెల్యేలు రీటబ్రతను ప్రతిపక్ష నేతగా సమర్థిస్తూ స్పీకర్కు లేఖ అందించారు. దీంతో మమత నియమించిన శోవన్దేబ్ చటోపాధ్యాయ స్థానంలో రీటబ్రత ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే, 60 మంది రీటబ్రత వెనక ఉన్నారు.




