TMC Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి వరస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఆ పార్టీకి లోక్సభలో 28 మంది ఎంపీలు ఉంటే, 20 మందికి పైగా ఎంపీలు తిరుగుబాటు చేశారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు, మమత ఇండియా కూటమిలో ఉన్నప్పుడు, ఎంపీలు మాత్రం ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం కాబోతున్నారు.
ఇదిలా ఉంటే, రెబల్ వర్గంగా ఉన్న 20 మంది ఎంపీలు, తమ వర్గాన్ని ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI) అనే ప్రాంతీయ పార్టీలో విలీనం చేసి, ఆ తర్వాత ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. ఈ చర్యతో టీఎంసీలో సంక్షోభం మరింత ముదిరింది. టీఎంసీలోనే ప్రత్యేక వర్గంగా ఉండటం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే రెబల్ వర్గం విలీనం ఆలోచనతో ప్లాన్ చేసింది.
“మేము ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’లో చేరాము. ఇది గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ. మేము అందులో విలీనమయ్యాము. అసలైన టీఎంసీ ఏది అనేది కోర్టు నిర్ణయిస్తుంది,” అని టీఎంసీ రెబల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశం తర్వాత ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలో రెబల్ వర్గం సమావేశమైన కొన్ని గంటల తర్వాత ఈ రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు, మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఓం బిర్లాకు లేఖ రాస్తూ.. టీఎంసీని ఒకే రాజకీయ పార్టీగా పరిగణించాలని, పార్టీకి చెందిన ఏ ఇతర వర్గానికి లేదా సమూహానికి ఎలాంటి గుర్తింపు, సదుపాయాలు కల్పించొద్దని కోరారు.




