తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్రెడ్డి పేరును అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. వీరు రేపు (గురువారం) తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేరును కూడా ఖరారు చేశారు. జాతీయ రాజకీయాల్లో ఆయనకున్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఎంతో కాలంగా వెన్నంటి ఉన్న వేం నరేందర్రెడ్డికి ఈసారి అవకాశం దక్కింది. సీఎం పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి నరేందర్ రెడ్డి పార్టీ కోసం చేసిన సేవలకు దక్కిన గుర్తింపుగా దీనిని భావిస్తున్నారు.
అభ్యర్థులు ఖరారు కావడంతో, అభిషేక్ మను సింఘ్వి , వేం నరేందర్రెడ్డి రేపు అధికారికంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాబలాల దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ అభ్యర్థుల ఎంపికకు ముందు ఏఐసీసీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జూమ్ మీటింగ్ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. సామాజిక సమీకరణాలు , పార్టీ విధేయతను పరిగణలోకి తీసుకుని మల్లికార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Off The Record : ఢిల్లీ వర్సెస్ గల్లీ.. బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై తెలంగాణ నేతల గుర్రు?




