తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సమీక్ష నిర్వహించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పలు రకాలు చర్యలు తీసుకుంటోంది. దీనిలో గతంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులు కొనుగోలు చేసే ట్రాక్టర్లు, ఇతర యంత్రాలపై వచ్చే 40 శాతం సబ్సిడీ నేరుగా కంపెనీలకు వెళ్లేది. దీనివల్ల నిధుల వినియోగంలో పారదర్శకత లోపిస్తోందని భావించిన ప్రభుత్వం, ఇకపై ఆ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే (DBT) జమ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల రైతులకు తమకు నచ్చిన నాణ్యమైన పనిముట్లను ఎంచుకునే స్వేచ్ఛ కలగడమే కాకుండా… దళారుల ప్రమేయం తగ్గుతుంది.
Also Read:Redeveloping Colonies: సొంత నిధులతో కొత్త భవనాలు.. ఢిల్లీలో 7 ప్రభుత్వ కాలనీలకు కొత్త కళ..
రాబోయే వానాకాలం (ఖరీఫ్) సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60.60 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సాగు విస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విత్తనాలు వేసే సమయానికి ఎరువుల కొరత రాకుండా, ఇప్పటి నుంచే బఫర్ స్టాక్ను జిల్లాల వారీగా సిద్ధం చేయాలని సూచించారు. నేల సారాన్ని పెంచేందుకు రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను ఏప్రిల్ (APR) నెలాఖరులోపు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
Also Read:T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?
వ్యవసాయ శాఖ ఆధునీకరణలో భాగంగా ప్రతి గ్రామంలోని రైతు వేదికల ద్వారా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు సిద్ధం అవుతున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులకు సలహాలు ఇచ్చేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే.. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఉందో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, దానికి అనుగుణంగా మార్కెటింగ్ సదుపాయాలను కల్పించనున్నారు. ఈ వినూత్న మార్పుల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా.. ప్రభుత్వ రాయితీలు అర్హులైన ప్రతి రైతుకూ సక్రమంగా అందేలా మంత్రి తుమ్మల పటిష్టమైన యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.




