బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ గెలవదని.. ఆ అవకాశమే ఉండదని ఆర్జేడీ నేత, బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అన్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. పలు అంశాలపై పూర్తి ఏకాభిప్రాయం కుదిరిందని.. వాటిపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. “ఐదు కీలక అంశాలపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆ అంశాలను మేమంతా కలిసి బలంగా లేవనెత్తుతాం. ఈ విషయాల్లో ఇండియా కూటమి పూర్తిగా ఐక్యంగా ఉంది” అని చెప్పారు.
అదే సమయంలో ఎన్నికల నిర్వహణ విధానంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తే బీజేపీకి గెలిచే అవకాశం ఉండదు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMలు) గురించి ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న సందేహాలను మరోసారి ప్రస్తావించిన ఆయన.. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని సూచించారు.
తేజస్వి యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల పారదర్శకత, ఈవీఎంల వినియోగం, బ్యాలెట్ పేపర్ విధానం వంటి అంశాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా కూటమి రాబోయే రోజుల్లో ఈ అంశాలను మరింత బలంగా ప్రస్తావించే అవకాశమున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.




