Tamil Nadu: సినీ నటి త్రిష మరోసారి తమిళనాడు రాజకీయాల్లో టార్గెట్ అయ్యారు. అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయ్ కుమార్ సీఎం విజయ్ను విమర్శించేందుకు త్రిషను టార్గెట్ చేశారు. విజయ్కు ‘ప్రియమైన’ త్రిషను తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన జయలలితా పేరవై సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కావేరీ నది నీటిని కర్ణాటక నుంచి విడుదల చేయించడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శలు చేశారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు టీవీకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించే క్రమంలో ఉదయ్ కుమార్ త్రిషపై వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిర్మాత అర్చన కల్పాతిని తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏడుగురు సభ్యుల రాష్ట్రస్థాయి కమిటీలో నియమించింది.
ఇదిలా ఉంటే, ఉదయ్ కుమార్ వ్యాఖ్యలపై త్రిష అభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనకు వ్యతిరేకంగా మధురైలో పోస్టర్లు అంటించారు. త్రిషను రాజకీయాల్లోకి లాగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఉద్దేశిస్తూ డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం తమిళనాడులో రాజకీయ ఆందోళనల్ని పెంచింది. దీనికి ముందు బీజేపీ రాష్ట్ర చీఫ్ నైనార్ నాగేంద్రన్ కూడా త్రిషపై వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.




