T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కొలంబో వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో శ్రీలంకను 61 పరుగుల తేడాతో ఓడించింది న్యూజిలాండ్ జట్టు… ఈ విజయంతో న్యూజిలాండ్ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, శ్రీలంక టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఆరంభంలో ఫిన్ అలెన్ త్వరగా ఔటైనా, టిమ్ సీఫెర్ట్ (34) కొంత స్థిరత్వం ఇచ్చాడు. గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర కీలక భాగస్వామ్యంతో స్కోరును ముందుకు నడిపించారు. మధ్య ఓవర్లలో వికెట్లు పడినా, చివర్లో మిచెల్ సాంట్నర్, కోల్ మెక్కాంచీ వేగంగా పరుగులు జోడించి జట్టును పోటీదక్షమైన స్కోరుకు చేర్చారు.
శ్రీలంక బ్యాటింగ్ వైఫల్యం
ఇక, 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి బంతికే పాతుమ్ నిస్సాంక ఔటవడంతో ఒత్తిడి పెరిగింది. వరుసగా వికెట్లు కోల్పోయిన లంక జట్టు కోలుకోలేకపోయింది. కమిందు మెండిస్ (31) మాత్రమే కొంత ప్రతిఘటన చూపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ను తమవైపు తిప్పాడు. మాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టగా, సాంట్నర్, ఫిలిప్స్ తలా ఒక వికెట్ సాధించారు. శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులకే పరిమితమైంది.
పాయింట్ల పట్టికలో పరిస్థితి
గ్రూప్-2లో ఇంగ్లాండ్ ఇప్పటికే రెండు విజయాలతో సెమీఫైనల్కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ ఈ విజయంతో రెండో స్థానంలో నిలిచి ఆశలను నిలబెట్టుకుంది. ఇక శ్రీలంకకు పాయింట్లు లేకపోవడంతో టోర్నమెంట్ నుంచి అధికారికంగా బయటపడింది. మరోవైపు పాకిస్తాన్కు ఇంకా అవకాశాలు ఉన్నప్పటికీ, తదుపరి మ్యాచ్ల ఫలితాలపై వారి భవితవ్యము ఆధారపడి ఉంది. న్యూజిలాండ్ తన తదుపరి మ్యాచ్లో గెలిస్తే నేరుగా సెమీస్ చేరే అవకాశాలు బలపడతాయి. మొత్తంగా చూస్తే, కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ టోర్నమెంట్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో సూపర్ విక్టరీ సాధించగా, శ్రీలంక సెమీఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించడం అభిమానులకు నిరాశ కలిగించింది.




