Storyboard: బిహార్ రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతోంది. తొలిసారి బీజేపీ సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నీతీశ్కుమార్ రాజ్యసభకు వెళ్లనుండటంతో కమలం పార్టీకి మార్గం సుగమమైంది. బిహార్లో బీజేపీ కల ఎట్టకేలకు సాకారం అవుతోంది. 4 నెలల క్రితం జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 89స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ నితీష్కుమార్కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది బీజేపీ. అప్పటి నుంచే నీతిశ్కుమార్ను మార్చటం తథ్యమనే విశ్లేషణలు మొదలయ్యాయి. గతేడాది జరిగిన ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం పూర్తిగా కమలం పార్టీ కార్యక్రమంగానే సాగింది. కొత్త మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖతో పాటు కీలక శాఖలను కాషాయదళం దక్కించుకుంది. ప్రధాని మోడీ- హోం మంత్రి అమిత్ షా పాలిటిక్స్ ఎలా ఉంటాయో…మరోసారి రుజువయింది. బిహార్లో బీజేపీ, జేడీయూ కూటమిగా అధికారంలోకి వచ్చారు. నితీశ్కుమార్ను ముఖ్యమంత్రి చేశారు. ఆ రాష్ట్రానికే చెందిన నబిన్ సిన్హాకు…పార్టీ జాతీయ పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు బిహార్లో తమ పార్టీ నేతను ముఖ్యమంత్రిని చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగటానికి మిత్రపక్షాలు కీలకమని భావిస్తున్న తరుణంలో…వ్యూహాత్మకంగా నితీశ్ను సీఎం పీఠం నుంచి తప్పించి.. తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. కేంద్ర కేబినెట్లో బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైంది. దీంతో.. నితీశ్ పార్టీ మద్దతుపై…భవిష్యత్లో ఎలాంటి సమస్య రాకుండా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
2015, 2025లో మెజార్టీ సీట్లలో విజయం సాధించినప్పటికీ…నితీష్కుమార్కే పాలన పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచి సీఎం పీఠం దక్కించుకునేందుకు ప్రధాన మంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. నాలుగు నెలల తర్వాత వాటిని అమలు చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా…అటు బిహార్లో…ఇటు కేంద్రంలో పావులు కదిపింది. ఆర్జేడీకి బలం లేకపోవటంతో…గతంలో లాగా నితీశ్ ఆ పార్టీ వైపు చూసే అవకాశం లేదు. దీంతో గేమ్ ప్లాన్ అమలు చేసింది. బిహార్లో కాషాయ జెండా ఎగురవేసేలా మోదీ-షా ద్వయంతో వ్యూహాలు అమలు చేసింది. నితీష్కుమార్ను రాజ్యసభకు పంపడం ద్వారా…బీజేపీ లైన్ క్లియర్ చేసుకుంది. 20 ఏళ్లుగా సీఎం కుర్చీకే అతుక్కుపోయిన నితీష్ను బీజేపీ పక్కా ప్లాన్తో తప్పించింది. ఆయన స్థానంలో తమ పార్టీకి చెందిన నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు రంగం చేసింది. నితీష్కుమార్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా…బిహార్లో కాషాయ జెండా రెపరెపలాడే అవకాశం వచ్చింది. 20 ఏళ్లుగా రాష్ట్రానికే అంకితమైన ఆయన…కేంద్ర కేబినెట్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. నితీష్కుమార్ను రాజ్యసభకు పంపడం ద్వారా…రాష్ట్రాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం బీజేపీకి వచ్చింది. జేడీయూలో బలమైన నేతగా ఉన్న నితీష్కుమార్ అడ్డు తొలగించుకుంటే…మరింత బలపడవచ్చనే అంచనా వచ్చిన బీజేపీ…అందుకు అనుగుణంగా పావులు కదిపింది. నితీష్ను రాజ్యసభకు పంపడం ద్వారా…రాష్ట్ర పగ్గాలు కాషాయ పార్టీ చేతికి రానున్నాయి. ఒక్కసారి బీజేపీ చేతుల్లోకి రాష్ట్రం వచ్చిందంటే చాలు…మళ్లీ మళ్లీ ఎలా అధికారంలోకి రావాలో ఆ పార్టీకి తెలిసినంతగా ఏ పార్టీకి తెలియదు.
ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన నేత ప్రమాణస్వీకారం చేయనుండటంతో…ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరూ సీఎం చెప్పినట్లు వినాల్సి ఉంటుంది. అప్పుడు జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఏఎం శాసనసభ్యులు…చచ్చినట్లు కాషాయ పార్టీ హైకమాండ్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ముఖ్యమంత్రి మాటకు ఎదురు చెప్పే అవకాశం ఉండదు. పాలన మొత్తం బీజేపీ చేతుల్లోకి రాగానే…కూటమిలోని పార్టీలను ఎలా నిర్వీర్యం చేయాలో బీజేపీకి బాగా తెలుసు. బీజేపీ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకి ఉన్న నితీష్ను రాజ్యసభకు పంపి…మోడీ-షా ద్వయం పైచేయి సాధించింది. నితీష్ను రాజకీయాలకు పరిమితం చేసి…రాష్ట్రంలో చక్కం తిప్పాలని కమలం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతానికి కూటమి పార్టీలతో పాలన సాగించినా…వచ్చే ఎన్నికల నాటికి జేడీయూను భూస్థాపితం చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా చేరి…ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా దక్కించుకోవాలో బీజేపీకి బాగా తెలుసు. మహరాష్ట్రలో కాషాయ పార్టీ ఇదే ఫార్మూలాను అనుసరించింది. దాన్నే ఇప్పుడు బిహార్లో అమలు చేస్తోంది. మహరాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో సక్సెస్ అయింది. మాజీ సీఎం ఏక్నాథ్ షిండే ద్వారా…శివసేనను చీల్చింది. షిండేతో పాటు అసంతృప్త ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేసి…ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. రెండేళ్లకుగాపై షిండే ముఖ్యమంత్రిగా పని చేసినా…పాలన మొత్తం ఫడ్నవీస్ నడిపించారు. శివసేనను చీల్చాక…ఎన్సీపీని దెబ్బకొట్టింది బీజేపీ. నేషనలిస్టు కాంగ్రెస్కు చెందిన అజిత్ పవార్ను తన వైపు తిప్పుకొని…శరద్పవార్కు ఊహించని షాక్ ఇచ్చింది. శివసేన, ఎన్సీపీలోని కీలక నేతలను…తమ కూటమి వైపు తిప్పుకొని ఆ పార్టీలను దెబ్బకొట్టింది కాషాయ పార్టీ.
2024 ఎన్నికల్లో బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్పవార్ వర్గాలు కలిసి పోటీ చేశాయి. 2వందలకుపైగా స్థానాలతో అధికారంలోకి వచ్చాయి. పగ్గాలు బీజేపీ చేతుల్లోకి వచ్చాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఎన్నికయ్యారు. కూటమి సర్కార్లో ఏక్నాథ్ షిండే పాత్ర నామమాత్రంగానే మిగిలిపోయింది. అడిగిన శాఖలు కూడా ఇవ్వలేదు. మరో డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ మరణించారు. ఆయన భార్యను డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించింది బీజేపీ. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే చచ్చిన పాములా…బీజేపీ ప్రభుత్వంలో కొనసాగించాల్సిన పరిస్థితి కల్పించింది. ఇలా ప్రత్యర్థి పార్టీలను చావుదెబ్బ కొట్టిన బీజేపీ…ఇప్పుడు మహారాష్ట్ర ఫార్ములానే…బిహార్లోనూ అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. కేంద్రంలో ఎన్డీయే మనుగడకు జేడీయూ మద్దతు తప్పనిసరైనా…బిహార్లో నితీస్కుమార్ను తప్పించటం మాములు విషయమేమీ కాదు. 2020 ఎన్నికల్లో తొలిసారి జేడీయూకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో బీజేపీ కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి…43 సీట్లకే పరిమితం చేసింది. జేడీయూ ఎక్కువ సీట్లు గెలుపొందకుండా…పరోక్షంగా దెబ్బకొట్టింది. జస్ట్ 43 సీట్లకే పరిమితం అయ్యేలా వ్యూహాలు అమలు చేసి సక్సెస్ అయింది. బీజేపీ 74 స్థానాల్లో గెలుపొందింది. దీంతో సీఎం పదవి కోసం నితీశ్కుమార్…ఆర్జేడీ సాయంతో కుర్చీని కాపాడుకున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నాళ్లో కొనసాగలేదు. అవినీతి పేరుతో ఆర్జేడీకి దూరమై…ఎన్డీయే గూటికి చేరారు.
2025 ఎన్నికల్లో జేడీయూకు 85 సీట్లు వస్తే…బీజేపీ 89 స్థానాలను కైవసం చేసుకుంది. అధిక స్థానాలు స్థానాలు సాధించిన బీజేపీ…సీఎం పదవి విషయంలో వెనక్కి తగ్గింది. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే…అప్పట్లో వెనక్కుతగ్గింది. అదును చూసి…జేడీయూను దెబ్బకొట్టింది. నాలుగు నెలల్లో నితీష్కుమార్ చేత రాజీనామా చేయిస్తోంది. పార్టీకి ప్రధాన వనరైన మహిళలు, రైతులు…బీజేపీ వైపు మొగ్గుతున్నారన్న సమాచారంతో… జేడీయూ నేతలు అప్రమత్తమయ్యారు. దీన్ని కాషాయ పార్టీ నేతలు పసిగట్టారు. ఇక ఆలస్యం చేయరాదని భావించిన బీజేపీ…నితీష్ను రాష్ట్రానికి దూరం చేయాలని డిసైడ్ అయింది. ఆయన్ను రాజ్యసభకు పంపడం ద్వారా…పూర్తిగా బిహార్ రాజకీయాలకే దూరం చేసింది.
తొలిసారిగా 1985లో జనతాదళ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నితీశ్ కుమార్ గెలిచారు. అనంతరం జార్జ్ ఫెర్నాండేజ్ కలిసి 1994లో సమతా పార్టీని స్థాపించారు. 1996లో తొలిసారి లోక్సభకు ఎన్నికైన నితీష్…వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2005లో బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించింది. దీంతో తొలిసారిగా సీఎం అయ్యే అవకాశం నీతీశ్కు దక్కింది. అప్పట్లో నీతీశ్కు చెందిన జేడీయూ, బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2010 ఎన్నికల్లోనూ మళ్లీ ఎన్డీఏ కూటమే నెగ్గింది. కానీ 2013 జూన్లో నీతీశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో దోస్తీకి కటీఫ్ చెప్పి, లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్లతో చేతులు కలిపారు. ఈ పరిణామంతో రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు కొత్త సీఎంగా జితన్ రాం మాంఝీని నియమించారు. ఆర్జేడీ, కాంగ్రెస్లకు కటీఫ్ చెప్పి, మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు నితీష్కుమార్. 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నీతీశ్ పార్టీ జేడీయూ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమిని విజయమే వరించింది. కానీ 2022 ఆగస్టులో నీతీశ్ సంచలన ట్విస్ట్ ఇచ్చారు. ఆయన అకస్మాత్తుగా ఎన్డీఏ కూటమిని వదిలేసి, ఆర్జేడీ, కాంగ్రెస్లతో చేతులు కలిపారు. ఈ దోస్తీ రెండేళ్లే కొనసాగింది. 2024 జనవరిలో నీతీశ్ మరోసారి ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు. 2025లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకోసారి ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగించింది. వరుసగా 10వసారి సీఎం అయ్యే అవకాశాన్ని నీతీశ్ పొందారు.
బిహార్ పాలిటిక్స్ అనేక ట్విస్టుల ఇచ్చిన నితీష్కుమార్ను…ఎప్పటి నుంచే దెబ్బ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ…నితీష్ను రాజ్యసభకు పంపి…జేడీయూను బలహీన పర్చేలా వ్యూహాలు సిద్ధం చేసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే…తన ఆపరేషన్ను షురూ చేయనుంది. ప్రధానంగా జేడీయూను నిర్వర్యం చేస్తే…సుశాసన్బాబు ఆటోమేటిక్గా బలహీనపడుతాడు. మహారాష్ట్రలాగే…బిహార్లోనూ…జేడీయూ నేతలకు రెడ్కార్పెట్ పరచనుంది. మంత్రివర్గంలో కొనసాగాలన్నా…నియోజకవర్గంలో పనులు జరగాలన్నా…బీజేపీ చెప్పినట్లు వినాల్సి ఉంటుంది. అప్పుడు జేడీయూతో పాటు ఇతర పార్టీ నేతలు కాషాయ పార్టీకి జైకొట్టాల్సి ఉంటుంది. అప్పుడు బీజేపీ నేతలను ఎదురించలేక…సొంత పార్టీ నేతలను వద్దనలేని పరిస్థితిని నితీష్కుమార్కు కల్పించనుంది. నితీష్కుమార్కు 75 ఏళ్లు దాటిపోయాయి. వచ్చే ఎన్నికల నాటికి 80 ఏళ్లు వస్తాయి. 2030లో జేడీయూ సీన్…కుక్కలు చింపిన విస్తరిలా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
2025 అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి…ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మోడీ ప్రచారం చేసినా…అమిత్ షా ప్రచారం చేసినా…కూటమిలో ఎవరో ఒకరు సీఎం అవుతారని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకానీ…నితీష్కుమారే పగ్గాలు చేపడుతారని ఎవరు చెప్పలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మోడీ, అమిత్ షా దాటేస్తూ వచ్చారు. నితీష్కుమార్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే…కష్టాలు తప్పవని బీజేపీ వర్గాలు భావించాయి. కుర్మీలు ఎన్డీఏ కూటమికి దూరమవుతుండటాన్ని గ్రహించింది. పోలింగ్కు పది రోజుల ముందు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు నాన్చుడు ధోరణి అవలంభించిన బీజేపీ…నితీషే సీఎంగా బాధ్యతలు చేపడతారంటూ ప్రకటించింది. మరోవైపు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడ్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఒడిశాలో మాదిరిగా…అనూహ్యంగా కొత్తవారికి అవకాశం దక్కే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఒడిశా మాదిరిగా ఎవరూ ఊహించని నాయకుడు లేదా అగ్రవర్ణాలకు చెందిన నేతకు సీఎం పీఠం దక్కే అవకాశం ఉందని కొందరు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మండల్ ఉద్యమం తర్వాత సీఎం పీఠం అగ్రవర్ణాలకు దూరమనే అనుమానాలను యూపీ, రాజస్థాన్, మహారాష్ట్రల్లో చెరిపేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బిహార్లో కూడా అర్హత ఆధారంగానే సీఎం అభ్యర్థి ఎంపిక జరగొచ్చని బీజేపీ నేతలు అంటున్నారు.
1990ల్లో బిహార్ రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యానికి ముగింపు పలికిన మండల్ ఉద్యమంతోనే లాలూప్రసాద్ యాదవ్, నీతీష్ కుమార్ కీలక నేతలుగా ఎదిగారు. ఇప్పుడు బీజేపీ కూడా సామాజిక వ్యూహంతోనే బడుగు, బలహీన వర్గాలకే సీఎం పీఠం కట్టబెట్టవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బిహార్ ఉపముఖ్యమంత్రి, హోంశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సామ్రాట్ చౌదరి కోయెరీ- ఓబీసీ సామాజికవర్గానికి చెందినవారు. ఈ వర్గానికి ఇప్పటివరకు సీఎం అయ్యే అవకాశం రాలేదు. ఆయనను పెద్ద నాయకుడిని చేస్తామని ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ప్రకటించారు. అయితే సామ్రాట్ చౌదరీ ఆర్జేడీ నుంచి వచ్చి పదేళ్లు కూడా కాకపోవడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనపై ఎంతవరకు విశ్వాసం చూపుతుందన్నది ఆసక్తి రేపుతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అయోధ్య ఉద్యమ సమయం నుంచి ఏబీవీపీలో, ఆరెస్సెస్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన బిహార్లో అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. నిత్యానందరాయ్కు అవకాశం ఇస్తే అగ్రవర్ణాలు, నీతీష్ కుమార్ వర్గానికి చెందిన కుర్మీలు, ఇతర అత్యంత వెనుకబడినవర్గాల నుంచి వ్యతిరేకత రావచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు బీజేపీ ఆధిపత్యంతో జేడీయూలో తమ ఉనికి పట్ల ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతల్లో ఆందోళన మొదలైంది. కుటుంబ రాజకీయాలను వ్యతిరేకించే నీతీశ్ కుమార్ తన కుమారుడు నిశాంత్ను 2రోజుల క్రితమే రాజకీయరంగ ప్రవేశం చేయించారు. ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక ముందు పరిస్థితులు పాతరోజుల్లా ఉండకపోవచ్చని తెలుస్తోంది. నితీష్ కుమారుడితో సహా తమ మంత్రులంతా పదవుల్లో కొనసాగాలంటే బీజేపీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందేనని జేడీయూకు చెందిన ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు నీతీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం…రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ రాజకీయంగా నీతీశ్ కుమార్ను హైజాక్ చేసిందని ఆరోపించారు. నితీశ్ను సీఎం పదవి నుంచి తొలగించడానికి బీజేపీ సుముఖంగా ఉందంటూ…గతంలో చేసిన వాదనలను గుర్తు చేశారు. తాము చెప్పిందే జరిగిందంటూ ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
మిత్రపక్షాలతో సఖ్యతగా ఉంటూనే.. సొంతంగా తమ బలం.. తమ ప్రభుత్వం అనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. ప్రాంతీయ పార్టీలను నామారూపాల్లేకుండా చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం. ప్రాంతీయ పార్టీలతోనే పొత్తు పెట్టుకొని గెలిచి…ఆ పార్టీలనే భూస్థాపితం చేయడం కాషాయ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. బీజేపీ తనది కాని చోట లేని చోట పొత్తులు కలుపుతుంది. మెల్లగా చోటు సంపాదించుకుంటుంది. ఆ తర్వాత ఓట్లతో పాటు పెంచుకుంటుంది. ఆయా రాష్ట్రాల్లో కొంచెం బలం పెరిగాక…ఫిఫ్టీ ఫిఫ్టీ పవర్ షేరింగ్ అంటుంది. కొంతకాలానికి సర్వం తానే అంటుంది. అధికారాన్ని దక్కించుకుంటుంది. ఇది అనేక రాష్ట్రాల్లో కమలం పార్టీ చేసిన ఆపరేషన్. ఇందులో తప్పేమీ లేదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఎదిగి తీరాల్సిందే. అయితే బీజేపీ అనుసరించే వ్యూహాలు…విధానాలు…ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యర్థులు అంచనా వేయలేరు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాషాయం జెండా ఎగరవేయాలన్నది బీజేపీ లక్ష్యం. ఆ పార్టీ నాయకులు కొందరు ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతూ ఉంటారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపి తన ఉనికి లేని రాష్ట్రాల్లో కూడా బలాన్ని పెంచుకుంటోంది. ప్లాన్ ఏ ప్రకారం ప్రాంతీయ పార్టీతో జత కట్టటం. ప్లాన్ బీ ఆ పార్టీ లీడర్ ఎదురు తిరిగితే మరో పార్టీతో పొత్తుపెట్టుకోవటం కామన్. ఈ రెండు కుదరకపోతే…ప్రాంతీయ పార్టీలన్నింటినీ బలహీనపరిచి..ఏకచత్రాధిపత్యం చెలాయించడం బీజేపీ వ్యూహం. నేరుగా పోటీ చేస్తే…సొంతంగా అధికారంలోకి వస్తుంది. ఇది కుదరకపోతే…ప్లాన్ ఏ, ప్లాన్ బీ ఆప్షన్ రెడీగా ఉంటాయి.
ఇప్పటికే మహారాష్ట్రలో ఈ ప్లాన్ను పక్కా అమలు చేసి…అద్భుతమైన ఫలితాలు సాధించింది. అక్కడి ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీలను కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఇప్పుడు బిహార్లోని ప్రాంతీయ పార్టీల వంతు వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి…బిహార్లోని ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయో…ఎన్ని కనుమరుగు అవుతాయో అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకేతో పాటు మరికొన్ని పార్టీలతో కలిసి…బీజేపీ పోటీ చేస్తుంది. ఇప్పటికే సీట్ల షేరింగ్పై క్లారిటీ వచ్చింది. జయలలిత మరణం తర్వాత…ఆ పార్టీని బలహీనపర్చడంపైనే ఫోకస్ చేసింది. అన్నాడీఎంకే పతనమైతే…ఆ స్థానంలోకి తాను వచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ప్రాణవాయువులా పని చేస్తుంది. బీజేపీ బలం లేని రాష్ట్రాలు, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్…సైలెంట్గా పని చేసుకుంటూ పోతుంది. బీజేపీకి ఏం కావాలో…ఆ ఆజెండాను తీసుకెళ్లడంతో ఆర్ఎస్ఎస్ పాత్ర మరువలేనిది. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో…మూడింటిపై బీజేపీ గురి పెట్టింది. బెంగాల్, తమిళనాడులో ఆర్ఎస్ఎస్ చాపకింద నీరులా పని చేసుకుంటూ వెళ్తోంది. బెంగాల్లో పరిస్థితి సానకూల పవనాలు వీస్తున్నాయని బీజేపీ భావిస్తోంది. అదే విధంగా తమిళనాడు, కేరళలోనూ కొత్త వ్యూహాలు అమలు చేసేలా రంగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ను విస్తరించి…ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత పెంచాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ప్రవేశ పెట్టేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది.
తెలంగాణలో బీఆర్ఎస్ను బలహీనపర్చి…ఆ స్థానంలోకి తాను రావాలని శతవిధాలు ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపైనే పోరాటం చేస్తూనే ఉంది. సమయం వచ్చినపుడల్లా…ఆ పార్టీ విధానాలను ఎండగడుతోంది. అనుకున్నట్లుగానే 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి. గతంలో ఎన్నడూ అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు సాధించింది. బీజేపీ దెబ్బకు తెలంగాణకు కారు పార్టీ ఒక్క పార్లమెంట్ సీటులోనూ గెలవలేకపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ టీడీపీ, జనసేనతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బలహీన పర్చినంత ఈజీగా…ఏపీలో సాధ్యం కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంటుంది. గ్రౌండ్ లెవల్ నుంచే పార్టీని బలంగా తయారు చేయడంలో ఆ పార్టీకి తిరుగులేదు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతున్నా…ఏపీలో మాత్రం కుదరడం లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తోంది. ఇక్కడ సొంతంగా పోటీ చేయడం కురదడం లేదు. ఆపరేషన్ 2029 లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. యూపీ ఎన్నికలకు ముందే ఊహించని పరిణామాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. బిహార్ పరిణామాలతో మిత్రపక్షాలు అప్రమత్తం అవుతున్నాయి. దీంతో.. మే నెలలో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ కొత్త ఎత్తుగడలు.. వ్యూహాలు అమలయ్యేలా మాస్టర్ స్కెచ్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్న బీజేపీ అధినాయకత్వం తీసుకునే రాజకీయ నిర్ణయాలు ఇప్పుడు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి.




