నేడు స్వేఛ్చా వాయువులు పీలుస్తూ ఎలాంటి టెన్షన్ లేకుండా నిద్రిస్తున్నామంటే దానికి కారణం వీరుల ప్రాణ త్యాగాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. షహీద్ దివస్ (అమరవీరుల దినోత్సవం) భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 23న జరుపుకుంటారు. ఈ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల మహా త్యాగాలను స్మరించుకునే దినం. 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్, శివరామ్ రాజ్గురు, సుఖ్దేవ్ థాపర్లను ఉరితీశారు. వీరు కేవలం 23-24 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు.
Also Read:Petrol Price Hike: పెట్రోల్, డీజిల్పై రూ.55 పెంపు.. అక్కడ రూ.321కి చేరిన లీటర్ పెట్రోల్ ధర..
బ్రిటిష్ అధికారి సాండర్స్ హత్య, సెంట్రల్ అసెంబ్లీలో బాంబు దాడి వంటి చర్యలతో విప్లవ ఉద్యమాన్ని ఊపందుకునేలా చేశారు. లాలా లజపత్ రాయ్ మీద బ్రిటిష్ పోలీసుల లాఠీఛార్జ్ వల్ల ఆయన మరణించడానికి ప్రతీకారంగా ఈ వీరులు సాహసోపేతమైన చర్యలు చేపట్టారు. ఉరి శిక్షకు ముందు కూడా వీరు ఏమాత్రం భయపడలేదు. చిరునవ్వుతో ఉరితాడును ముద్దాడారు. “ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదంతో యువతలో విప్లవ జ్వాలను రగిలించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ మహాన్ త్యాగాన్ని గుర్తుంచుకునేందుకు మార్చి 23ని షహీద్ దివస్ లేదా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ముగ్గురు ధైర్యవంతులైన సైనికులను స్మరించుకునే రోజు ఇది. అయితే, భారతదేశంలో అమరవీరుల దినోత్సవాన్ని సంవత్సరానికి మూడుసార్లు జరుపుకుంటారని చాలా తక్కువ మందికి తెలుసు. ఆ మూడు రోజులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
30 జనవరి
సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరి 30వ తేదీన అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత చరిత్రలో ఈ రోజు అత్యంత విషాదకరమైన రోజులలో ఒకటి, ఎందుకంటే 1948లో ఇదే రోజున జాతిపిత మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి హత్య చేశాడు. మహాత్మా గాంధీ అహింస, సత్యం, ఐక్యత అనే సూత్రాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టారు. ఆయన త్యాగం లక్షలాది మంది భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. మహాత్మా గాంధీ చేసిన గొప్ప కార్యాలను స్మరించుకుంటూ, భారతదేశంలో ఆయన వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. మహాత్మా గాంధీని స్మరించుకోవడానికి ఈ రోజున దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
23 మార్చి
సంవత్సరంలో రెండవ అమరవీరుల దినోత్సవాన్ని మార్చి 23న జరుపుకుంటారు. ఈ రోజు మార్చి 23, కాబట్టి మనం నేటి అమరవీరుల దినోత్సవం గురించి కూడా తెలుసుకుందాం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ముగ్గురు గొప్ప విప్లవకారులు సంతోషంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆ చీకటి రోజు ఇది. రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్లను ఈ రోజే ఉరితీశారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన విప్లవకారులను గౌరవించటానికి ప్రతి సంవత్సరం ఈ రోజును అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. అమరవీరులైన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా ఈ రోజు భారతదేశం అంతటా ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నారు. ఈ ముగ్గురు గొప్ప విప్లవకారులు ఎల్లప్పుడూ యువ తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటారు.
Also Read:Leon Panetta: బిన్ లాడెన్ వేటగాడు మాజీ సీఐఏ అధికారి.. ట్రంప్కు హోర్ముజ్పై కీలక సూచనలు
21 అక్టోబర్
సంవత్సరంలో మూడవ, చివరి అమరవీరుల దినోత్సవాన్ని అక్టోబర్ 21న పాటిస్తారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు సిబ్బందిని ఇది స్మరించుకుంటుంది. ఈ రోజును పోలీస్ మెమోరియల్ డే లేదా పోలీస్ అమరవీరుల దినోత్సవం అని కూడా పిలుస్తారు. 1959లో ఇదే రోజున, లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్లో చైనా సైన్యం ఒక భయంకరమైన దాడి చేసింది, అందులో 10 మంది ధైర్యవంతులైన పోలీసు సిబ్బంది అమరులయ్యారు. ఈ సంఘటనే భారత్-చైనా సరిహద్దు వివాదానికి నాంది పలికింది, అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న, దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలు అమరవీరుల జ్ఞాపకార్థం ఈ రోజును పాటిస్తాయి.




