విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం, మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను వెల్లడించింది. సాయికృష్ణ ఇప్పటికే మరణించాడని, అతడి మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూసినట్లు ఓ ఎస్సై వాంగ్మూలం ఇచ్చినట్లు సిట్ పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు పాత్రపై సిట్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది.
2026 మే 6 నుంచి మే 8 మధ్యకాలంలో సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూసినట్లు ఎస్సై తన వాంగ్మూలంలో తెలిపాడు. అనంతరం అతడు కస్టడీలో ఉండగానే గాయాలపాలై మరణించినట్లు దర్యాప్తులో లభించిన ఆధారాలు సూచిస్తున్నాయని సిట్ పేర్కొంది. అంతేకాకుండా జూన్ 2 కంటే ముందే సాయికృష్ణ మరణించి ఉండవచ్చని తమకు అనుమానాలు ఉన్నాయని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది. ఈ కేసులో కీలక ఆధారాలను నాశనం చేసినట్లు కూడా సిట్ ఆరోపించింది. ముఖ్యంగా 2026 మే 1 నుంచి జూన్ 1 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ డీవీఆర్లో లేకుండా చేసినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఈ డీవీఆర్లను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించినట్లు పేర్కొంది. సైంటిఫిక్ ఆధారాలను చెరిపివేయడం ద్వారా కేసు నిజాలను దాచేందుకు ప్రయత్నించినట్లు సిట్ అనుమానిస్తోంది.
సాయికృష్ణ మరణించాడని తెలిసినా కూడా ఆ విషయాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది మేజిస్ట్రేట్కు తెలియజేయలేదని సిట్ ఆరోపించింది. అంతేకాకుండా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన కుమారుడి గురించి అడగడానికి స్టేషన్కు వెళ్లినప్పుడు సీఐ నాగరాజు ఆమెను దుర్భాషలాడినట్లు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది. ఈ కేసులో మరో కీలక అంశం హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్. సాయికృష్ణ తల్లి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. పోలీసు అధికారులు కోర్టు ముందు పూర్తి వాస్తవాలను వెల్లడించలేదని సిట్ పేర్కొంది. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని కూడా అభిప్రాయపడింది.
దర్యాప్తులో బయటపడిన పరిణామాలను పరిశీలించిన తర్వాత సాయికృష్ణ హత్యకు గురై ఉండవచ్చని సిట్ భావిస్తోంది. కస్టడీలో ఉన్న సమయంలో అతడు మరణించాడని, అనంతరం ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేసి కేసును మిస్సింగ్ కేసుగా మలిచే ప్రయత్నం జరిగిందని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ కేసులో పూర్తి నిజాలు వెలికితీయాలంటే ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నాగరాజును సుదీర్ఘంగా విచారించడం అవసరమని సిట్ కోర్టుకు తెలిపింది. సాయికృష్ణ కస్టడీ మృతి కేసులో సిట్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలపై కోర్టు విచారణ, ఫోరెన్సిక్ నివేదికలు, తదుపరి దర్యాప్తు ఆధారంగా పూర్తి నిజాలు వెలుగులోకి రానున్నాయి.




