భారతదేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు, అది వారి కనీస ఆహార భద్రతకు ఒక భరోసా. ప్రభుత్వాలు అందించే రాయితీ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అర్హులైన పేదలకు చేరడమే లక్ష్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేస్తుంది. అయితే.. కొన్ని సందర్భాలలో అనర్హులు కూడా ఈ కార్డులను కలిగి ఉండటం వల్ల నిజమైన పేదలకు అన్యాయం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులను నిరోధించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటారు.
తాజాగా.. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పటికీ రేషన్ కార్డు జారీ అయిందంటూ సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై స్థానిక తహశీల్దార్ ఝాన్సీరాణి అధికారికంగా స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించారు. సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన సదరు కుటుంబానికి 2018లోనే కుర్తి రావులచెరువు గ్రామం పేరిట ఈ రేషన్ కార్డు మంజూరైనట్లు ఆమె నిర్ధారించారు.
అయితే.. సదరు కార్డు లబ్ధిదారులు 2018 నుండి ఇప్పటివరకు ఎక్కడా కూడా ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తీసుకోలేదని, ఆ కార్డు పూర్తిగా పెండింగ్లోనే ఉండిపోయిందని స్పష్టం చేశారు. సాధారణంగా జిల్లా పౌరసరఫరాల శాఖ (డీఎస్ఓ) నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని కార్డులను వ్యవస్థ నుంచి తొలగిస్తారు. కానీ సాంకేతిక లోపం వల్ల ఈ కార్డు అలాగే ఉండిపోయింది. పైగా ఈ కుటుంబ సభ్యులు ఎలాంటి ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ఆ కార్డు ఎప్పటి నుంచో నిరుపయోగంగా మారింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే, స్థానిక డీలర్ నుంచి నివేదిక సేకరించి, ఆ అనర్హుల రేషన్ కార్డును శాశ్వతంగా రద్దు చేసినట్లు ఎమ్మార్వో ఝాన్సీరాణి ప్రకటించారు. అర్హులకే సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తామని ఆమె పేర్కొన్నారు.




