Pakistan: పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి దిగేందుకే ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి’’కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక దేశాన్ని, దేశ ప్రజల్ని ఏకం చేయాలంటే ‘‘యుద్ధం’’ని మించిన మార్గం లేదని పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ భారత్తో చిన్న పాటి ఘర్షణను కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఇటీవల కాలంలో ఆసిమ్ మునీర్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. బెలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), పాక్ తాలిబాన్లు పచ్చడిపచ్చడి చేస్తున్నాయి.
దృష్టి మళ్లించేందుకే:
ఈ ప్రాంతాల్లో పాక్ సైన్యం పనిచేయడానికి కూడా భయపడుతున్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్తే తిరిగి వస్తామా..? లేదా..? అనే భయం పాక్ సైన్యం, అధికారుల్లో ఉంది. గత నెలలో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లున్న ‘‘జఫర్ ఎక్స్ప్రెస్’’ని బీఎల్ఏ యోధులు హైజాక్ చేసి, వందలాది మంది పాక్ ఆర్మీ, ఐఎస్ఐ సిబ్బందిని ఊచకోత కోశారు. అయితే, ఈ ఊచకోతను పాక్ సైన్యం అడ్డుకోలేక నిస్సహాయ పరిస్థితిలో చూస్తూ ఉండిపోయింది. దీంతో, సైన్యంలోని ఓ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ఆసిమ్ మునీర్ రాజీనామా చేయాలని సైన్యంలో పనిచేస్తున్న దిగువ స్థాయి అధికారులు లేఖ రూపంలో అల్టిమేటం విధించారు. దీంతో, ఇలాంటి సమయంలో ఎలాగైనా తన స్థానాన్ని కాపాడుకునేందుకు ఆసిమ్ మునీర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. దీని కారణంగానే, భారత్తో యుద్ధం అంటే పాక్ ప్రజలు భావోద్వేగానికి గురై, ఒక్కటిగా మారుతారనే నీచపు ఆలోచన పాక్ సైన్యం, ఆర్మీ చీఫ్లో ఉంది. గతంలో కూడా ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక, వాటిని సద్దుమణిగేలా చేసేందుకు భారత్తో ఘర్షణ కొనితెచ్చుకున్నారు.
ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలే ఉదాహరణ:
పహల్గామ్ దాడికి ముందు ఓ కార్యక్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ.. కాశ్మీర్ తమ జీవనాడి అని, కాశ్మీర్ కోసం పోరాతున్న వారికి సాయం చేస్తామని చెప్పాడు. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తామని చెప్పాడు. హిందూ, ముస్లిం కలిసి ఉండలేరని అన్నాడు. అంటే, పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న విభజనను మతం పేరుతో ఒక్కటి చేయాలని చూస్తున్నాడు. చెప్పాలంటే, కావాలని భారత్తో ఒక చిన్నపాటి యుద్ధాన్ని మునీర్ కోరుకుంటున్నాడు. రెండు అణ్వాయుధ దేశాలే కాబట్టి, కొద్ది కాలానికి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారిస్తుందని పాక్ ఆర్మీ, ఆర్మీ చీఫ్ భావిస్తున్నారు.
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత:
మతం ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజలకు తిండి దొరకడం లేదు. కానీ ఆర్మీ బడ్జెట్, వారీ జీతాలు మాత్రం పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ ప్రజలు రగిలిపోతున్నారు. ఇప్పటికే బెలూచిస్తాన్ తాము వేరుపడుతామని ఉద్యమం చేస్తుంటే, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ రాష్ట్రాలు కూడా పంజాబ్ రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజల ఆధిపత్యాన్ని సహించడం లేదు.
ఇటీవల, సింధు నదీ కాలువ ప్రాజెక్టుపై సింధ్ రాష్ట్ర ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తమ నీటిని పంజాబ్ కొల్లగొడుతుందని ఆరోపిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్లో అధికారం మొత్తం పంజాబ్ రాష్ట్రం చేతుల్లోనే ఉంది. పాక్ లోని సైన్యంలో దాదాపుగా 90 శాతం పంజాబీలే. వీరు తమ స్వార్థం కోసం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారనేది, బెలూచిస్తాన్, సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రజల ఆరోపణ. ఇన్ని గొడవల నేపథ్యంలోనే పాక్ ఆర్మీ భారత్తో ఘర్షణ కోరుకుంటోంది.