Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు అయిన ఇమ్రాన్ ఖాన్ దాదాపుగా 9 నెలల జైలు జీవితం తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు అనుమతి లభించింది. ఆయన భార్య బుష్రా బీబీ, సోదరి నూరిన్ నియాజీలు రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనను పరామర్శించారు. పాక్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ ఖాన్ను కలుసుకునేందుకు ఆయన కుటుంబీకులు, పీటీఐ నేతల్ని అనుమతించడం లేదు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రతి వారం తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, జైలు నుంచి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సిందిగా పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాక్ మీడియా నివేదిక ప్రకారం.. నూరిన్ నియాజీ ఈ ఏడాది మొదటిసారిగా ఇమ్రాన్ ఖాన్ను కలిశారు. ఈ సమావేశం తర్వాత ఆమె తన సోదరుడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య పరీక్షల కోసం షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, కుటుంబీలకుల్ని కలుసుకునే క్రమంలో రాజకీయాల ప్రస్తావన తేస్తే తమ ఆదేశాల్ని రద్దు చేసుకుంటామని సుప్రీంకోర్టు షరతు విధించింది. రెండు రోజుల్లోగా ఇమ్రాన్ ఖాన్ను షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆయనను ఆసుపత్రిలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది.




