Pakistan Whitewash: బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో మరో అద్భుత అధ్యాయాన్ని రాసుకుంది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాకిస్థాన్ ను 2-0తో వైట్వాష్ చేస్తూ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. సిల్హెట్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్, అన్ని విభాగాల్లోనూ పాకిస్థాన్ను పూర్తిగా సోమినాటే చేసింది. సిల్హెట్లో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులు చేసింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 232 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
మొదటి టెస్టులోనే పాకిస్థాన్పై తమ గడ్డపై తొలి విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్, అదే జోరును రెండో టెస్టులోనూ కొనసాగించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టైగర్స్ జట్టు, పాకిస్థాన్కు ఏ దశలోనూ అవకాశమివ్వలేదు. చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. ఓవర్నైట్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, సాజిద్ ఖాన్ వేగంగా పరుగులు సాధిస్తూ బంగ్లాదేశ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ సమయంలో కెప్టెన్ నజముల్ హుస్సేన్ షాంటో కీలక నిర్ణయం తీసుకుని బంతిని స్పిన్నర్ తైజుల్ ఇస్లాం చేతికి అప్పగించాడు. తైజుల్ అద్భుత బౌలింగ్తో మ్యాచ్ ను పూర్తిగా మార్చేశాడు. వరుస వికెట్లు పడగొడుతూ పాకిస్థాన్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన తైజుల్, మొత్తం మ్యాచ్లో తొమ్మిది వికెట్లు సాధించి బంగ్లాదేశ్ విజయానికి ప్రధాన కారకుడిగా నిలిచాడు.
437 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 358 పరుగులకే ఆలౌట్ అయింది. మహ్మద్ రిజ్వాన్ ఒంటరి పోరాటం చేస్తూ 94 పరుగులు సాధించినప్పటికీ జట్టును విజయానికి చేర్చలేకపోయాడు. చివర్లో సాజిద్ ఖాన్ కొంత ప్రతిఘటన చూపించినా బంగ్లాదేశ్ బౌలర్ల దూకుడును అడ్డుకోలేకపోయారు. ఈ మ్యాచ్లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో 126 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 69 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ అనంతరం లిట్టన్ దాస్ మాట్లాడుతూ.. తొలి రోజున పిచ్ చాలా కఠినంగా ఉందని, అవుట్ఫీల్డ్ కూడా నెమ్మదిగా ఉండటంతో పరుగులు చేయడం సవాల్గా మారిందని తెలిపాడు. కెప్టెన్ షాంటో ఇచ్చిన సలహాతో దూకుడుగా ఆడిన తర్వాత తన ఆట మారిందని చెప్పాడు. ఇక రెండు మ్యాచ్ల సిరీస్లో నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన మూషఫీక్ర్ రహీమ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. మొత్తం 253 పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.




