Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ అకృత్యాలకు పాల్పడుతోంది. హక్కుల కోసం పోరాడుతున్న అక్కడి ప్రజల్ని అణిచివేస్తోంది. నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, వందలాది మందిని పాక్ భద్రతా బలగాలు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. జూన్ 5 నుంచి జూన్ 9 మధ్య పాక్ ఆర్మీ చేపట్టిన భద్రతా ఆపరేషన్లలో భారీగా అకృత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో ఏడుగురు గర్భిణీ స్త్రీలతో సహా 26 మంది మరణించారు. మృతుల్లో 19 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పీఓకేలో నిరసనలకు నేతృత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఉద్యమంతో సంబంధం ఉన్న నిరసనకారులను అణచివేసేందుకు హత్యలు చేసినట్లు తెలుస్తోంది. నిరసనలను అణచివేయడానికి సుమారు 14,000 మంది అదనపు పాకిస్తానీ భద్రతా సిబ్బందిని PoKలోకి పాక్ ప్రభుత్వ పంపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్పై నిషేధం విధించింది.
ఈ నిరసనలు పీఓకేలోని మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిత్ బాల్టిస్తాన్, దాదియాల్, రావల్కోట్, సుధ్నోటీ, తట్టపాని వంటి ప్రాంతాలకు విస్తరించాయి. నిరసనకారులు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసిమ్ మునీర్ ఒక ఉగ్రవాది అంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. పాక్ ప్రభుత్వ అణిచివేతపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశం పాల్పడే అకృత్యాలకు జవాబుదారీగా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. పీఓకేలో మానవహక్కుల ఉల్లంఘనపై 30 మంది బ్రిటిష్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.




