OTR: గోదావరి జిల్లాల ఆక్వా రైతులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం తమను గిల్లి జోల పాడుతున్నట్టు ఫీలవుతున్నారా? ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదన్న ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా? ఆ అసహనంతో రాజకీయ సమీకరణలు కూడా మారిపోయే ఛాన్స్ ఉందా? రొయ్య రైతుల తాజా ఆలోచనలేంటి? కార్యాచరణ ఎలా ఉండబోతోంది? రాష్ట్రానికే కాదు… దేశానికే ఆదాయం తెచ్చి పెడుతున్నామంటూ నిన్న మొన్నటి వరకు మీసం మెలేసిన ఆక్వా రైతుల పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. కాసుల కురిపించే ఆక్వా వ్యాపారంపై ఇపుడు ఫీడ్ అండ్ సీడ్ కంపెనీల సిండికేట్ కన్ను పడటంతో చివరికి కష్టం తప్ప కాణీ మిగలని పరిస్థితి వచ్చిందంటూ లబోదిబోమంటున్నారు రైతులు. ఈ పరిస్థితుల్లో అండగా ఉంటుందనుకున్న కూటమి ప్రభుత్వం సైతం మెల్లిగా కుచ్చు టోపీ పెడుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయట. అందుకు రకరకాల కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అమలు చేస్తున్నామంటూ ఇటీవల పాలకొల్లులో భారీ బహిరంగ సభ పెట్టి మరీ… ప్రకటించారు రాష్ట్ర మంత్రులు. ప్రకటించడమంటే అలాఇలా కాదు… మీకెందుకు, మేం ఉన్నామంటూ ఊదరగొట్టేశారు. జీవో ఇచ్చేశాం, హామీ అమలు చేస్తున్నామని చెప్పి నెల రోజులు దాటినా… ఇప్పటికీ ఏ ఒక్క రైతుకూ సబ్సిడీ కరెంటు అందకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లాలో, ముఖ్యంగా డెల్టా ప్రాంత ఆక్వా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు చేస్తున్న మోసాలతో ఇప్పటికే భారీగా నష్టపోయాం.. మా కష్టాలు తీర్చండి మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా.. పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు సబ్సిడీ ఇస్తున్నామంటూ ఏకంగా మంత్రులే కీలక ప్రకటన ఇచ్చి, జీవో విడుదల చేసి రోజులు గడుస్తున్నా ఎందుకు అమలవడం లేదో అర్ధం కావడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు రైతులు.
ఇదే సమయంలో ఫీడ్ ధరలు తగ్గించాలంటూ ప్రభుత్వం కంపెనీలను హెచ్చరిస్తున్నా లెక్కచేయక పోవడంతో… భవిష్యత్తులో ఆక్వా సాగు చేయడం అంటే కత్తి మీద సామేనని అంటున్నారు. ఫీడ్ కంపెనీలను కంట్రోల్ చేయలేకపోతున్న ప్రభుత్వం…. అది పోతేపోనీ… కనీసం కరెంటు సబ్సిడీ అయినా ఇచ్చి ఆదుకుంటుందని అనుకుంటే….ఇప్పుడు ఆ ఆశ కూడా ఆవిరయ్యేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ క్రమంలో… గోదావరి ఆక్వా ఫార్మర్స్ మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఫీడ్ ధరలపై పోరాటం చేస్తున్న వాళ్ళను కొన్ని ఫీడ్ కంపెనీలు, ప్రభుత్వం తరఫున పెద్దలుగా వ్యవహరిస్తున్న కొద్దిమంది ఏరికోరి మరీ టార్గెట్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మేత ధరలకు సంబంధించిగానీ…, కరెంటు సబ్సిడీ విషయంలోగానీ… బహిరంగంగా నిరసన గళం వినిపిస్తే…. వారిని ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం నడుస్తోంది. ఈ విషయంలో ఇటీవల కోర్టుకు వెళ్ళిన కొంతమంది రైతులకు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయన్న గుసగుసలున్నాయి. పైగా ఫీడ్ ధరల పెరుగుదలతో రైతులెవ్వరూ ఇబ్బంది పడడం లేదంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కొందు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
వీటన్నిటి కలగలిపి చూస్తుంటే… మమ్మల్ని గట్టెక్కించడం ఎవరివల్లకాదన్న నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారట ఆక్వా రైతులు. కేవలం ఐదారు వందల కోట్ల విలువచేసే ఫ్యాక్టరీల కోసం నాలుగు లక్షల మంది రైతుల పొట్ట కొడుతున్నారన్న అభిప్రాయం ఆ వర్గాల్లో బలపడుతోంది. దీంతో… భవిష్యత్తు కార్యాచరణ దిశలో అక్వా రైతులు సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఏ రకంగా చూసినా… గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగుపై ఆధారపడి అనేక రంగాలు ఆధారపడి ఉంటాయి. అక్కడి రాజకీయాల్లోనూ ఈ ఫీల్డ్కు సంబంధించిన వాళ్ళే కాలకంగా ఉన్నారు. ఈ క్రమంలో… కొన్ని ఫీడ్ కంపెనీలు చేస్తున్న దందాకు ప్రభుత్వ పెద్దలు వంతపాడితే భవిష్యత్తులో డ్యామేజ్ తప్పదన్నది విస్తృతాభిప్రాయం. వాళ్లు నష్టపోతున్నారు…. రైతులను ఆదుకుంటామంటూ హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలోకి తీసుకురాకపోవడం గోదావరి జిల్లాలలో రాజకీయ సమీకరణాలు మార్పునకు కూడా కారణం అవుతుందా అన్న చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతుల పరిస్థితి… పోరాడితే పోయేదేముంది… అన్నట్టుగా ఉందంటున్నారు పరిశీలకులు.




