ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మాటకు కూడా విలువ లేకుండా పోతోందా? సీఎం చెబితే ఏంటి? మా దారి మాదే, మా బెదిరింపులు మావేనన్నట్టుగా ఎమ్మెల్యే అనుచరుల వ్యవహారం ఉందా? తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు బెదిరింపుల సెగ ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయి కంపెనీలనే టచ్ చేసిందా? వాళ్ళ దెబ్బకు ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వస్తోందా? ఏదా నియోజకవర్గం? ఏ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు అవి? ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినిల్లు కడప జిల్లా జమ్మలమడుగు. ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడానికి ఫ్యాక్షన్ను పురిగొల్పడం పాత వ్యవహారం. ఇప్పుడు ట్రెండ్ మారిందట. పగలు, ప్రతీకారాలు, నరుక్కోవడాలు తగ్గినా… ఆ ప్లేస్లో రాజకీయ నేతల్లో కాసుల కక్కుర్తి విపరీతంగా పెరిగిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఇందులో ఉచ్ఛ నీచాలు, స్థాయి భేదాలు కూడా ఉండటం లేదని, గన్పెట్టు షేర్ పట్టు అన్నట్టుగానే వ్యవహారం ఉందని చెప్పుకుంటున్నారు. కడప జిల్లాలో మొట్ట మొదటిసారిగా గత ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి బోణీ కొట్టింది బీజేపీ. సీనియర్ నేత, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన దేవగుడి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతవరకు బాగానే ఉన్నా… ఇప్పుడు ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన వర్గీయులు చేస్తున్న ఆగడాలకు అంతే లేకుండా పోతోందని అంటున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా…. తమకు వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారట. అడిగినంత ఇస్తే మీరు పని చేసుకోగలుగుతారు, లేదంటే తర్వాత మీ ఇష్టం అని కంపెనీల యజమానులకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుండటంతో…. ఇష్టం ఉన్నవాళ్ళు సమర్పించుకుంటున్నారు, లేని వాళ్ళు సర్దేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే రాను రాను వీరి వ్యవహారశైలి ముదిరిపోయి జాతీయ స్థాయి, మల్టీ నేషనల్ కంపెనీలను కూడా బెదిరించే రేంజ్కు వెళ్ళడంతో రచ్చ అవుతోందని మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గంలో. పెద్ద పెద్ద కంపెనీల్లో కాంట్రాక్ట్ పనులన్నీ తమకే ఇవ్వాలని, క్యాజువల్ లేబర్గా తమ వాళ్ళనే పెట్టుకోవాలని బెదిరిస్తుండటం సమస్యగా మారుతోందని అంటున్నారు. ఈ బెదిరింపుల ఎపిసోడ్స్లో పైకి ఆదినాయణరెడ్డి వర్గీయులు కనిపిస్తున్నా…. ఇదంతా ఆయనకు తెలియకుండానే జరుగుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయట స్థానికులకు. నియోజకవర్గంలో అదానీ పవర్ప్లాంట్ నిర్మాణ పనుల సబ్ కాంట్రాక్ట్ చేస్తున్న కంపెనీ మీద ఆ మధ్య ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడి చేశారు. అది జాతీయ స్థాయిలో రచ్చ అవడంతో స్వయంగా ముఖ్యమంత్రే ఎమ్మెల్యేని పిలిపించి మందలించినట్టు అప్పట్లో చెప్పుకున్నారు.
ఆ ఘటన మరువకముందే… రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి తరలించే బూడిద వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బూడిద రవాణా లారీలను అడ్డగించి నానా హంగామా చేశారు ఆదినారాయణ రెడ్డి అనుచరులు. ఆ గొడవ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం దాకా వెళ్ళింది. పరిష్కరించడానికి ఏకంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయినా సరే… ఆది అనుచరులు ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గలేదట. ఆ విషయంలో జేసీ వర్గీయులే కాస్త తగ్గడంతో వివాదం సద్దుమణిగిందని చెప్పుకుంటారు. ఆ రెండూపోను… ఇప్పుడు ఏకంగా అల్ట్రాటెక్ కంపెనీనే టార్గెట్ చేశారు ఎమ్మెల్యే మనుషులు. తమవాళ్ళకు కంపెనీ కాంట్రాక్ట్లు ఇవ్వలేదంటూ…
డైరెక్ట్గా… అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మైనింగ్ జోన్లోకి వెళ్ళి బెదిరించారట. సిమెంట్ ఫ్యాక్టరీలో జరుగుతున్న అన్ని కాంట్రాక్టు పనుల్ని తమ వర్గీయులకే ఇవ్వాలంటూ సున్నపురాయిని తీసుకువెళ్తున్న లారీలకు ఇన్నోవాలు, మినీ బస్సు అడ్డుగాపెట్టి దాదాగిరి చేశారట ఎమ్మెల్యే అనుచరులు. అది జాతీయ స్థాయి కంపెనీ కావడం, విషయం మళ్ళీ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడంతో… ఆయన మరోసారి సీరియస్ అయినట్టు సమాచారం. పరిశ్రమల నిర్వహణకు అడ్డుపడి ఆటంకాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. అటు అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులు కూడా తగ్గేదేలే అంటూు… పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు 12 మంది మీద కేసులు బుక్ అయ్యాయి.
మేటర్ ఈసారి ఆ స్థాయి రచ్చ కావడంతో… కొద్దిగా దూకుడు తగ్గించి అలర్ట్ అయిన ఆది వర్గం రివర్స్ డ్రామా మొదలు పెట్టిందట. వైసీపీ హయాంలో తమ కాంట్రాక్టు పనుల్ని రద్దుచేసి… వాళ్ళ అనుచరులకు కట్టబెట్టారని, వాటినే తిరిగి అడుగుతున్నామంటున్నట్టు సమాచారం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి… వైసీపీ వాళ్ళకు ఇచ్చిన పనులను రద్దుచేసి మా కార్యకర్తలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. సిమెంట్ కంపెనీలు కాంట్రాక్టు పనులకు టెండర్లు పిలిచి కమర్షియల్ గా చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, వైసీపీ వాళ్ళకు ఇస్తామంటే మాత్రం ఊరుకోబోమంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. ఆ సంగతి ఎలా ఉన్నా… జమ్మలమడుగులో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాల్ని భరించలేకపోతున్నామంటూ పరిశ్రమల యాజమాన్యాలు ముఖ్యమంత్రితో మొరపెట్టుకుంటున్నట్టు తెలిసింది. వాళ్ల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని వాపోతున్నారట. కానీ… స్వయంగా ముఖ్యమంత్రే ఒకటికి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చినా… ఆదినారాయణరెడ్డి ముషులు ఆగడంలేదంటే…. వాళ్లని ఏం చేయాలి? ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలంటున్నారు పరిశీలకులు.