Off The Record: అంతన్నారింతన్నారు. అప్పట్లో మీసాలు మెలేశారు. అధికారంలోకి వస్తే అంటు చూస్తామని తొడలు కొట్టారు. తీరా… కుర్చీలో కూర్చున్నాక ఇలాంటి నియోజకవర్గం ఒకటుందని మా పెద్దోళ్ళు మర్చిపోయారంటూ ఆవేదన పడుతున్నారట అక్కడ టీడీపీ లీడర్స్. మిగతా వాళ్ళలా మేం పదవులు అడగడం లేదు. అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించమన్నా పట్టించుకోవడం లేదని తెగ బాధపడుతున్నారట. బాబుగారూ… ప్లీజ్ ఒక్కసారి ఇటు చూడండని ఏ నియోజకవర్గ కేడర్ మొత్తుకుంటోంది? ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రత్యేకత ఏంటి?
Read Also: Off The Record: నిమ్మల రామానాయుడుకు సొంత సెగ్మెంట్ లో కొత్త కష్టం
వైసీపీ పాలనలో అడ్డమైన కేసులతో అష్టకష్టాలు పడ్డామని చెబుతుంటారు ఉమ్మడి చిత్తూరు జిల్లా టిడిపి లీడర్స్ అండ్ కేడర్.అక్రమ కేసులతో ఊళ్ళు విడిచి వెళ్ళిన వాళ్ళు సైతం ఉన్నారని అంటారు. కానీ… ఇప్పుడు ప్రభుత్వం మారినా, మా పరిస్థితి మాత్రం మారలేదు. ఏంటీ ఖర్మ మాకు అంటూ తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్ళు. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ బాధ అంతా ఇంతా కాదని అంటున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం14 అసెంబ్లీ సీట్లకుగాను… 12 స్థానాలను కైవసం చేసుకుంది కూటమి. అయితే పుంగనూరు, తంబళ్లపల్లెలో మాత్రం పెద్దిరెడ్డి కుటుంబం గెలిచింది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచినా నైతిక విజయం మాదేనన్నది టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు మాట. 2009,14,19 ఎన్నికల్లో ఎప్పుడూ 40వేలకు తగ్గని పెద్దిరెడ్డి మెజార్టీని ఈసారి ఐదువేలకు పరిమితం చేశామాంటే ఏ స్థాయిలో మేం పోరాడామో… అర్ధం చేసుకోవాలంటున్నారు పుంగనూరు తమ్ముళ్ళు. అప్పట్లో ఈ నియోజకవర్గంలో టీడీపీ పేరెత్తడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయన్నది వాళ్ళ మాట. టీడీపీ నేతలు నోరు విప్పితే కేరాఫ్ జైలు అన్నట్టుగా ఉండేదంటున్నారు. చివరికి సైకిల్ యాత్రకు వచ్చిన శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యకర్తల్ని బట్టలు విప్పించి కొట్టిన ఘటనను మర్చిపోలేకుండా ఉన్నామంటున్నారు.
Read Also: Hyderabad: ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..
అయితే, మరో వైపు చంద్రబాబు నాయుడి పుంగనూరు పర్యటన సమయంలో జరిగిన రాళ్ళదాడులు, పోలీసుల లాఠీ చార్జ్ అల్లర్లు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి అప్పట్లో. అ తర్వాత ఇన్ చార్జ్ చల్లా బాబుతో పాటు చిన్నా పెద్దా తేడా లేకుండా 300 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు నెలల తరబడి జైల్లో ఉన్నారు. వాటన్నిటినీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న పుంగనూరు టీడీపీ నాయకులు… అప్పటి, ఇప్పటి పరిస్థితుల్ని పోల్చి చూసుకుంటున్నారట. ఏదో.. పైపై ఉపశమనం తప్ప… నాటికి, నేటికి పెద్ద తేడా లేదని, దీనికోసమేనా…నాడు కేసులు పెట్టించుకుని నెలల తరబడి జైళ్ళలో మగ్గింది అంటూ నిట్టూరుస్తున్నారట. నాడు ఆ స్థాయిలో రచ్చ జరిగినా… తీరా అధికారంలోకి వచ్చాక…. పార్టీ పెద్దలు అసలు పుంగనూరు నియోజకవర్గం ఒకటి ఉందా? అక్కడ అంత సీన్ జరిగిందా అన్నట్టుగా ఉంటున్నారని, అలా ఎందుకో తెలియడం లేదని బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో పదవుల కోసం మిగిలిన నియోజకవర్గాల నాయకులు ఆరాటపడుతుంటే… మాకు ఆ ఆశలు కూడా లేవని అంటున్నారట. నాడు కేవలం పార్టీ కోసం పోరాడినందుకు మా మీద హత్యాయత్నం కేసులు పెట్టారని, ఆ అక్రమ కేసుల్ని ఎత్తేయిస్తే చాలు… మీరు వద్దు, మీ పదవులు వద్దని కన్నీళ్ళు పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే… కేసులు ఎత్తివేస్తామని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు కొందరు. ఇన్ఛార్జ్ చల్లా బాబు పార్టీ పెద్దల దగ్గరే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేశారట. కేసులు ఉన్నాసరే… ఇప్పటికీ వెనకడుగు వేయకుండా పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని అయినా మా పెద్దలు ఎందుకు పట్టించుకోవడంలేదో అర్ధం కావడం లేదంటున్నారట కొందరు కార్యకర్తలు.
Read Also: Off The Record: కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల మాటల వెనక వేరే లెక్కలు ఉన్నాయా..?
ఇక, కాస్త గడుసుగా మాట్లాడే వాళ్ళయితే… ఓ అడుగు ముందుకేసి…. పై స్థాయిలో వాళ్ళు వాళ్లు ఒక్కటైపోయారా ఏంటి? పిచ్చోళ్లలా కేసులు పెట్టించుకుని కూడా మేమే పోరాడుతున్నామా అంటూ…కొంచెం తేడా రియాక్షన్స్ కూడా ఇస్తున్నారట. మొన్నటి మొన్న ఏకంగా… టిడిపి కార్యకర్త వెంకటరమణను వైసీపీ వాళ్ళు దారుణంగా చంపేశారని, పార్టీ అధికారంలో ఉండి కూడా మేం ఇలాగే ప్రాణాలు వదలాల్సిందేనా? అప్పుడు, ఇప్పుడు వాళ్ళదే పైచేయిగా ఉంటుందా? ఈ మాత్రం దానికేనా మేం నానా కష్టాలు పడి పోరాటాలు చేసింది అంటూ తెలుగుదేశం కార్యకర్తలు గట్టిగానే ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇటు కేసులు ఎత్తేయించక, అటు పదవులు ఇవ్వక, ఇంకోవైపు వైసీపీ వాళ్ళు చెలరేగి ఇప్పటికీ హత్యలు చేస్తుంటే చోద్యం చూస్తూ ఉంటే… అసలు మేం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలంటూ ఆవేదనగా అడుగుతున్నారట పుంగనూరు తమ్ముళ్లు. అదే సమయంలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను జిల్లాలో ఎక్కడ లేనివిధంగా పుంగనూరులో ఓ రేంజ్లో నిర్వహించడం కూడా హాట్ టాపిక్ అయింది. మీరు మమ్మల్ని గుర్తించపోయినా… ప్రస్తుతానికైతే పార్టీని మేం గుండెల్లో పెట్టుకున్నామని, దాన్ని నిలబెట్టుకునే నైతికత మీదేనని చెప్పినట్టున్నారని అంటున్నారు పరిశీలకులు. పుంగనూరు కేడర్ ఆవేదన టీడీపీ పెద్దల చెవికెక్కుతుందో లేదో చూడాలి మరి.