Off The Record: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటోంది. రకరకాల గొడవలు, ఆరోపణలతో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గతంలో ఇక్కడ ముఠా కక్షలు, రాజకీయ ఘర్షణలు చాలా కామన్గా ఉండేవి. అదంతా వేరే సంగతి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన, పూర్తి నేలబారు వ్యవహారాలు నడుస్తున్నాయన్న టాక్ ఉంది నియోజకవర్గంలో. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులపై నిత్యం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిగాత వాటి సంగతి ఎలా ఉన్నా.. తాజాగా చికెన్ వ్యాపారంతో ముడిపెట్టి వస్తున్న ఆరోపణలు ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజారుస్తున్నాయన్న ఆవేదన కూడా ఉందట కొందరు టీడీపీ నాయకుల్లో. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో చికెన్ దందానే లేటెస్ట్ పొలిటికల్ హాట్. ఎమ్మెల్యే మనుషులు చికెన్ వ్యాపారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమవడంతో… వాటితో తనకు సంబంధం లేదని నిరసన కూడా తెలిపారు అఖిలప్రియ.
Read Also: Off The Record: అక్కడ కూటమిలో 3 పార్టీలకు బదులు 4 పార్టీలు ఉన్నాయా?
కానీ… తాజాగా చికెన్ వ్యాపారులు ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో… పొలిటికల్ కోళ్ళు కొక్కొరోకో అంటున్నాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి చికెన్ వ్యాపారులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరురాలు, టీడీపీ నాయకురాలు రమిజాబి చికెన్ వ్యాపారులను బెదిరిస్తున్నారన్నది ఆ ఫిర్యాదు సారాంశం. చాగలమర్రి చికెన్ వ్యాపారులు లైవ్ కోళ్ళను ఆళ్లగడ్డలోనే కొంటారు. ఆ కొనేదేదో… నాదగ్గరే కొనేయమంటూ చికెన్ షాపుల యజమానులను బెదిరిస్తున్నారట ఆమె. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే.. రమిజాబికి అసలు లైవ్ కోళ్ళ వ్యాపారమే లేదు. అంటే… ముందు షాపుల వాళ్ళని బెదిరించి తర్వాత తన మనుషులతో ఆ వ్యాపారం పెట్టించి దందా చేయాలనా? లేక ఆ బెదిరింపుల పేరుతో చికెన్ అమ్మకాల మీద రోజూ ఇంత కమీషన్ ఇవ్వమని డిమాండ్ చేయాలన్న వ్యూహం ఉందా అన్న చర్చ జరుగుతోంది ఆళ్ళగడ్డలో. ఆమె ఉద్దేశ్యం ఏదైనా….తమను బెదిరిస్తున్నారంటూ చికెన్ వ్యాపారులు చాంద్ బాషా, సర్దార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ దగ్గర కోళ్లను కొనకపోతే , షాపులు మూయిస్తామని హెచ్చరించినట్టు కూడా ఆరోపిస్తున్నారు వాళ్ళు. కోళ్ళు మేమే సప్లయ్ చేస్తాం… కిలోకి 30 రూపాయలు అదనంగా ఇవ్వమంటూ… రమిజాబి డిమాండ్ చేస్తున్నారని, ఆ అదనపు భారాన్ని డైరెక్ట్గా చికెన్ కొనేవాళ్ళ నుంచి వసూలు చేసుకోమంటున్నారని ఎస్పీకి చేసిన ఫిర్యాదులో రాశారు వ్యాపారులు.
Read Also: Devara : ‘చుట్టమల్లే’ సాంగ్ కు గుర్తింపు దక్కలేదు.. కొరియోగ్రాఫర్ కామెంట్స్..
అధికార పార్టీ నేతల అండ చూసుకునే రమిజాబి చెలరేగుతున్నారన్నది చాగలమర్రి చికెన్ వ్యాపారుల ఆరోపణ. అమిజాబి ఎప్పుడూ…ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెంటే తిరుగుతుంటారు. ఆమె కుటుంబం కూడా మొదటి నుంచి టీడీపీలోనే ఉంది. కానీ… గతంలో ఎప్పుడూ వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు రాలేదు. బెదిరింపులు, నేర చరిత్ర కూడా లేదు. అందుకే ఇప్పుడు కొత్తగా చికెన్ వ్యాపారులు చేస్తున్న ఆరోపణలకు ప్రాధాన్యం వచ్చిందని అంటున్నారు. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా… ఆళ్ళగడ్డలో ఎమ్మెల్యే అనుచరులు చివరికి చికెన్ షాపుల్ని కూడా వదలడం లేదన్న టాక్ మాత్రం గట్టిగా ఉంది. ఇది భూమా అఖిలప్రియ ఇమేజ్ని గట్టిగా డ్యామేజ్ చేస్తోందని, అప్రతిష్ట తీసుకువచ్చే ఇలాంటి వ్యవహారాల మీద ఆమె దృష్టి సారించి అనుచరుల్ని కట్టడి చేస్తారా లేదా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.