Monalisa: ప్రయాగ్రాజ్ కుంభమేళా సమయంలో నేషనల్ వైడ్ ఫేస్ సంపాదించుకున్న మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవల, కేరళలో తన ముస్లిం బాయ్ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకుంది. అయితే, ఈ వివాహంపై ‘‘లవ్ జిహాద్’’ ఆరోపణలు వచ్చాయి. వీటిని కొత్త జంట తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై మోనాలిసా తండ్రి కన్నీటిపర్యంతమవుతున్నారు. తన కుమార్తెను రాష్ట్రానికి తీసుకురావాలని శుక్రవారం మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ను కోరారు.
మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ పట్టణానికి చెందిన, సంచార ‘పార్ధి’ కమ్యూనిటీకి చెందిన మోనాలిసా భోంస్లే (18), బుధవారం నాడు కేరళలోని పూవార్ ప్రాంతం, అరుణమనూర్ వద్ద ఉన్న నైనార్ ఆలయంలో ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కేరళ ప్రభుత్వంలోని మంత్రులు కూడా హాజరయ్యారు. కేరళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మోసాలిసా తండ్రి జైసింగ్ భోంస్లే కీలక ఆరోపణలు చేశారు. తన కుమార్తె ‘‘లవ్ జిహాద్’’ బాధితురాలిగా మారిందని అన్నారు. ముస్లిం యువకులు హిందూ మహిళల్ని ప్రేమ పేరుతో ఆకర్షించి, వివాహం చేసుకుని మతం మార్చడాన్ని ‘‘లవ్ జిహాద్’’గా వ్యవహరిస్తుంటారు.
Read Also: Iran: భారత్ను అమెరికా వేడుకుంటోంది.. ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు..
“నా కుమార్తె దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. మోనాలిసాను సురక్షితంగా మధ్యప్రదేశ్కు తిరిగి తీసుకువచ్చేలా చూడాలని నేను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను కోరుతున్నాను. ఫర్మాన్ ఖాన్ అనే ఒక ముస్లిం యువకుడు ఆమెను మోసపూరితంగా తన వలలో వేసుకున్నాడు. ఇది ‘లవ్ జిహాద్’ కేసు,” అని అన్నారు. తన కుమార్తె సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్ని్స్తోందని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటుందని జైసింగ్ చెప్పారు.
ఇదిలా ఉంటే, మోసాలిసా ఇంటికి తిరిగి వచ్చేలా ఒప్పించడానికి హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ఇది లవ్ జిహాద్ కాదని మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. తన నిర్ణయం ప్రకారమే వివాహం జరిగిందని వెల్లడించారు. తనపై వస్తున్న పుకార్లలో నిజం లేదని చెప్పారు. తన తల్లిదండ్రులు మేనత్త కొడుకుతో పెళ్లి చేయాలనుకున్నారని, అది తనకు ఇష్టం లేదని చెప్పింది.




