MLC Anantha Babu Arrest: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. రాజమండ్రిలోని తూర్పు గోదావరి జిల్లా కోర్టు వద్ద అనంతబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఈ ఘటనతో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు రాజమండ్రి కోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు తన భార్య లక్ష్మీ దుర్గతో కలిసి హాజరయ్యారు. విచారణ అనంతరం బయటకు వస్తుండగా ముందుగా సిద్ధంగా ఉన్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ అరెస్టు సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!
దళిత యువకుడు, తన డ్రైవర్గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుతో సంబంధం ఉన్న మరో కేసులో అనంతబాబును అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలపై కాకినాడ సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో అనంతబాబు గతంలోనూ అరెస్టయ్యారు. తాజాగా అదే కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం వంటి ఆరోపణలతో రెండోసారి అరెస్టు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతబాబు అరెస్టుతో జిల్లాలో రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.




