Meenakshi Natarajan: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన వేళ, తన నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ తొలిసారి స్పందించారు.. తన నామినేషన్ రద్దు నిర్ణయం బీజేపీ అసలు ఉద్దేశాలు, విధానాలను ప్రజల ముందుకు తీసుకువచ్చిందని ఆమె ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన మీనాక్షి నటరాజన్, అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపినప్పుడే వారి రాజకీయ వ్యూహం స్పష్టమైందన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.
‘ఒకే పార్టీ వ్యవస్థను తీసుకురావాలనే ప్రయత్నం’
బీజేపీ తమ అభ్యర్థిని ఎమ్మెల్యే కాకపోయినా బరిలోకి దింపిందని, అప్పుడే రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే రాజకీయాలు జరుగుతున్నాయని అర్థమైందని మీనాక్షి పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా బీజేపీ విధానాలు బహిర్గతమయ్యాయని, ఇప్పుడు ప్రశ్న ప్రజాస్వామ్యం గెలుస్తుందా లేదా అన్నదేనని వ్యాఖ్యానించారు. “ఇది కేవలం ఒక రాజ్యసభ సీటు లేదా ఒక అభ్యర్థి గురించి మాత్రమే కాదు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు, భారత సమాఖ్య వ్యవస్థ, దేశ ఆలోచన (‘ఐడియా ఆఫ్ ఇండియా’) కోసం జరుగుతున్న పెద్ద పోరాటంలో భాగం. ఒకే పార్టీ పాలన, నియంతృత్వ ధోరణులను తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది” అని ఆమె ఆరోపించారు.
ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నిరసన
నామినేషన్ తిరస్కరణ అనంతరం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఓట్ల దోపిడీ తర్వాత ఇప్పుడు సీట్ల దోపిడీ జరుగుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఈ పరిణామంపై స్పందించిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ, కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లో ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తుందని తెలిపారు. చట్టపరమైన అంశాలను విస్మరించి రాజకీయ దురుద్దేశంతో చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారి కూడా బీజేపీ అజెండాకు అనుగుణంగా వ్యవహరించారని విమర్శించారు.
‘కారణం లేకుండానే నామినేషన్ రద్దు చేశారు’ : సచిన్ పైలట్
కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ, మీనాక్షి నటరాజన్పై ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదా చార్జ్షీట్ లేదని పేర్కొన్నారు. కేవలం ఒక నోటీసు ఆధారంగా రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ను రద్దు చేయడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. తమ ప్రతినిధి బృందాన్ని ఎన్నికల సంఘం అధికారులు కలవకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు.
‘క్రిమినల్ కేసు వివరాలు దాచారు’
మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం మోహన్ యాదవ్.. కాంగ్రెస్ అభ్యర్థిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీనాక్షి నటరాజన్ తనపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను ఉద్దేశపూర్వకంగా అఫిడవిట్లో వెల్లడించలేదని అన్నారు. అభ్యర్థిపై కేసులు ఉంటే వాటిని తప్పనిసరిగా వెల్లడించాల్సిన బాధ్యత ఉందని, ఈ విషయంలో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. అయితే, నామినేషన్ పరిశీలన సమయంలో మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పత్రాలు తిరస్కరించబడటంతో మధ్యప్రదేశ్లో మూడో రాజ్యసభ సీటుకు పోటీ ముగిసింది. దీంతో బీజేపీ అభ్యర్థి Mahesh Kevat ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.




