Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.. మధ్యప్రదేశ్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెపై తెలంగాణలో నమోదైన క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల అధికారులు, నామినేషన్ పత్రాల్లో పూర్తి సమాచారం అందించలేదని భావించి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించినట్లు సమాచారం. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులు సహా అన్ని వివరాలను అఫిడవిట్లో తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. అలాగే నామినేషన్ తిరస్కరణపై న్యాయపరమైన మార్గాలను ఆశ్రయించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం కాంగ్రెస్కు పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో మరింత రాజకీయ చర్చకు దారితీసే అవకాశం ఉంది.




