Madanapalle Minor Girl Case: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో చోటుచేసుకున్న చిన్నారి దారుణ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించగా, సంచలన విషయాలు బయటపడ్డాయి. వైద్యుల ప్రాథమిక నివేదిక ప్రకారం చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. అనంతరం నిందితుడు చిన్నారిని నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు పోస్టుమార్టం ద్వారా తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
ఘటనపై స్పందించిన డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇక, చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అధికారులు, కేసులో నిందితుడిని త్వరితగతిన పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ దారుణ ఘటనపై ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇక, మదనపల్లెలో చిన్నారి హత్యాచార కేసు ఉద్రిక్తతకు దారితీసింది. బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటూ ఆందోళనకు దిగారు.. నిందితుడ్ని తమకు అప్పగించాలని.. లేకపోతే ఎన్కౌంటర్ చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.. అయితే, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ సహా ఇతర పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు.. ఆందోళన కారణంగా చెన్నై-ముంబై హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని.. కేసులో కచ్చితంగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామంటూ కడప ఎస్పీ విశ్వనాథ్ వివరించారు.. కానీ స్థానికులు ఆందోళన విరమించడం లేదు… చివరకు పోలీసులు అర్థం చేయించడంతో వెనక్కి తగ్గారు.. ఆ తర్వాత పోస్టుమార్టం పూర్తి చేశారు..
మరోవైపు, మదనపల్లె ఏడేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.. మదనపల్లి ఘటనపై విచారణం వ్యక్తం చేసిన ఆయన.. చిన్నారి రిషిక తల్లిదండ్రులతో మాట్లాడారు.. నిందితుడిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు… కఠిన శిక్ష పడేలా చూస్తానన్న హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ఇక, ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇది చాలా బాధాకరమన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడానని.. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నానని తెలిపారు. హత్యాచారానికి పాల్పడిన వ్యక్తి డ్రగ్స్, గంజాయి సేవించలేదని.. అతిగా మద్యం తాగాడని పేర్కొన్నారు. స్థానికులు నిందితుడ్ని తమకు అప్పగించాలని ఆందోళన చేశారని.. కానీ చట్టప్రకారం వెళ్లాలి కాబట్టి అతడ్ని పోలీసు స్టేషన్కు తరలించామని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనల విషయంలో ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తుందని అనిత స్పష్టం చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు చేసి జైలుకు పంపిస్తామని.. అతడ్ని బయటకు రాకుండా చూసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు హోంమంత్రి.




