తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. రాష్ట్ర అప్పులు, గురుకుల విద్యాసంస్థల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదని విమర్శించారు. గతంలో ప్రెస్క్లబ్కు వచ్చి చర్చిద్దామని సీఎం సవాల్ విసిరారని, తాము ఆ సవాల్ను స్వీకరించి వెళ్లినా సీఎం మాత్రం రాలేదని గుర్తుచేశారు.
ఇటీవల రాష్ట్ర అప్పుల అంశంపై కూడా చర్చకు రావాలని సీఎం సవాల్ విసిరారని, తాను వెంటనే సిద్ధమని ప్రకటించానని కేటీఆర్ చెప్పారు. అయితే ఆ తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్యలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణ భవన్కు వస్తామని ప్రకటించిన జూపల్లి.. అక్కడికి రాకుండా వేరే చోట నుంచి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గురుకుల విద్యాసంస్థల్లో జరిగిన అవినీతిపై కూడా బహిరంగ చర్చకు సిద్ధమని తాము ప్రకటించామని, మాజీ మంత్రి హరీశ్రావు గన్పార్క్కు చర్చ కోసం బయలుదేరితే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు.
‘చర్చ చేయాలనే ఉద్దేశం నిజంగా ఉంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించండి. అక్కడే రాష్ట్ర అప్పులు, గురుకులాల అవినీతి సహా అన్ని అంశాలపై చర్చిద్దాం. చేతకాని వాళ్లు సవాళ్లు ఎందుకు విసురుతారు?. చర్చకు మీరే పిలుస్తారు.. చివరకు పారిపోయేది కూడా మీరే’ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. గన్పార్క్కు రావడానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే తాను అక్కడికి బయలుదేరగానే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారన్నారు. ‘మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? లేక సర్కస్ నడుపుతున్నారా?. నేను గన్పార్క్కు వస్తానంటే చార్మినార్కు రమ్మంటారు.. తర్వాత కొల్లాపూర్కు రమ్మంటారు. నిజంగా దమ్ముంటే నాకు పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి గన్పార్క్కు తీసుకెళ్లండి’ అని సవాల్ విసిరారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన హామీలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్లో లక్ష ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన హామీని ప్రభుత్వం అమలు చేస్తే.. తాను ఎలాంటి చర్చకైనా సిద్ధమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గన్పార్క్కు వెళ్తుండగా అరెస్టైన హరీశ్రావును పోలీసులు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ నుంచి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అంతకుముందు తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీ పక్కనే కేటీఆర్ కూర్చోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




