కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం పోలీసులు సంఘటనాస్థలికి చేరుకోగానే ఓం ప్రకాష్ రక్తపుమడుగులో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్య పల్లవి.. కుమార్తె చంపినట్లుగా పోలీసులు తేల్చారు.
ఈ మధ్య కాలంలో ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు కనుగొన్నారు. అయితే చావుబతుకుల మధ్య రక్తపుమడుగులో ఉన్నప్పుడు తనను కాపాడాలంటూ 15 నిమిషాలు ఓం ప్రకాష్ వేడుకున్నారు. కానీ భార్య, కుమార్తె ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయలేదని పోలీసులు తెలిపారు. ఇక ఘటనాస్థలిలో రెండు కత్తులు, ఒక బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. హత్య చేశాక.. ఘటనాస్థలిలో కారం పొడి చల్లేశారు. ఆయుధాలపై కూడా కారం చల్లారు.
ఇక ఓం ప్రకాష్ను చంపేశాక.. ఆ రాక్షసుడిని చంపేశానంటూ భార్య పల్లవి విల్లా బయటకు వచ్చి పెద్ద పెద్దగా కేకలు వేసింది. దీంతో అక్కడ వారంతా షాక్కు గురయ్యారు. గత వారం రోజులుగా ఆస్తి గొడవలు ఎక్కువైనట్లుగా తెలుస్తోంది. 3 రోజుల క్రితం ఓం ప్రకాష్ భార్య పల్లవి ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్లో పెట్టిన మెసేజ్ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇంట్లో భర్త తుపాకీతో తిరుగుతున్నాడని.. తనను, కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తున్నాడని మెసేజ్లో వాపోయింది. భర్తపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. కానీ ఇంతలోనే ఓం ప్రకాష్ హత్యకు గురయ్యాడు.
ఇక ఓం ప్రకాష్ను చంపేశాక భార్యనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని నివాసానికి పోలీసులు వచ్చారు. చాలా సేపు డోర్లు ఓపెన్ చేయలేదు. మొత్తానికి లోపలికి వెళ్లి చూడగా హత్యకు గురైనట్లుగా గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు.




