కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది కొంత మంది కేటుగాళ్ల వ్యవహార శైలి. జనం ఉపయోగించే ఆహార పదార్థాలను తమ స్వలాభాల కోసం యథేచ్ఛగా కల్తీ చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న కల్తీ టీ పౌడర్ను పట్టుకున్న పోలీసులు.. తాజాగా భారీగా కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కేటుగాడ్ని అరెస్ట్ చేశారు.
సబ్బులు, షాంపూలు మాత్రమే కాదు.. టీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కల్తీ చేసేస్తున్నారు. తాజాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ చేసి దర్జాగా వ్యాపారం చేస్తున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉదంతం ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పక్కా సమాచారంతో ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎం.ఎస్.మఖ్తా ప్రాంతంలోని ఒక తయారీ కేంద్రంపై మెరుపు దాడి నిర్వహించారు. 4 వేల కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు 20 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, వెయ్యి కిలోల ఉప్పు, 5 కిలోల పసుపు పొడి, గ్రైండింగ్ మిషన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఆబిడ్స్కు చెందిన జసాని ఇల్యాన్ అరెస్ట్
అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో.. ఆరోగ్యానికి హానికరమైన రీతిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఆబిడ్స్కు చెందిన జసాని ఇల్యాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జేజే ఫుడ్స్’ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ పేస్ట్ను బహిరంగంగా ప్లాస్టిక్ టబ్బులలో ఉంచడం వల్ల దుమ్ము, ధూళి, ఈగలు వచ్చి చేరాయి. అలాగే ఈ జేజే ఫుడ్స్ కాలం చెల్లిన FSSAI లైసెన్స్ను వినియోగిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. వేల కిలోలుగా తయారు చేస్తున్న ఈ కల్తీ పేస్ట్ను హోటళ్లు, కిరాణా షాపులకు ఇల్యాన్ సరఫరా చేస్తున్నాడు.
సాధారణంగా ఈ కల్తీ పేస్ట్ తయారీలో కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పాటు బరువు పెరగడానికి టిటాన్ డయాక్సైడ్, గమ్ పౌడర్, ప్రమాదకరమైన సింథటిక్ రంగులను వాడుతుంటారు. నిల్వ ఉండటానికి అనుమతించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల ఇవి విషతుల్యంగా మారుతాయి. పోలీసులు రైడ్ చేయని పక్షంలో ఆ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వలు మార్కెట్లోకి వెళ్లి ఉండేది. ఫలితంగా వేలాదిమంది గ్యాస్ట్రిక్ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి బారిన పడే ప్రమాదం ఉండేదంటున్నారు పోలీసులు.
మరోవైపు ఇల్యాన్పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4), 275 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




