India T20 Captaincy: భారత టీ20 క్రికెట్లో ఓ సంచలన మార్పు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్ను తప్పించేందుకు బీసీసీఐ (BCCI) సెలక్టర్లు సిద్ధయ్యారట. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సంబంధించిన జట్లను ఎంపిక చేసే ముందే.. కొత్త నాయకత్వ ఎంపికపై కీలక భాగస్వాములతో చర్చలు జరపనున్నారు. గతేడాది ఆసియా కప్, కేవలం రెండు నెలల క్రితమే టీ20 ప్రపంచకప్ను గెలుచుకుని భారత జట్టు పొట్టి ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో బోర్డు సభ్యులు సంతోషంగానే ఉన్నారు. కానీ, బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ ఫామ్పై బీసీసీఐ అగ్ర అధికారులు, టీమ్ మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో సూర్య తీవ్రంగా తడబడుతుండగా.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ అతని కెరీర్ను మరింత కష్టాల్లోకి నెట్టింది.
సూర్యకుమార్ స్థానంలో కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఛాంపియన్గా నిలిపిన అనుభవం శ్రేయస్ అయ్యర్కు బలంగా మారగా, యువ ఆటగాడు తిలక్ వర్మను భవిష్యత్తు దీర్ఘకాలిక కెప్టెన్గా బోర్డు పరిశీలిస్తోంది. ఈ విషయమై బీసీసీఐకి చెందిన ఓ ముఖ్య అధికారి పీటీఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. “సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించడం దాదాపు ఖాయమైంది. ఐపీఎల్ ముగిసేవరకు అతని ఫామ్ను పరిశీలించాలని సెలక్టర్లు భావించారు. అయితే అతను కేవలం పరుగులు చేయకపోవడమే కాదు, పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. సెలక్టర్లు అతనిని భవిష్యత్తు ప్రణాళికల నుంచి పక్కన పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మలు తదుపరి టీ20 కెప్టెన్ రేసులో ఉన్నారు” అని తెలిపారు. అలాగే తిలక్ వర్మ నాయకత్వ నైపుణ్యాలను పరీక్షించేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లే ‘ఎ’ జట్టుకు అతడిని కెప్టెన్గా నియమించినట్లు సదరు అధికారి పేర్కొన్నారు.
అయితే కెప్టెన్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటార్గా ఉన్న సమయంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని దగ్గరుండి చూసినప్పటికీ.. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్కు అయ్యర్ నాయకత్వంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ మాత్రం సంజూ శాంసన్ వైపు మొగ్గు చూపుతోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో శాంసన్ ప్రదర్శనపై ప్రశంసలు వ్యక్తమవడమే ఇందుకు కారణం. కానీ, సంజూ శామ్సన్ లేదా ఇషాన్ కిషన్లలో ఎవరికీ సుదీర్ఘకాలం స్థిరంగా ఆడే నైపుణ్యం లేదనే సందేహంలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రేయస్ అయ్యర్కు గనుక టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే.. సూర్యకుమార్ యాదవ్ జట్టులో తన స్థానాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే, తన చివరి అసైన్మెంట్లో భారత్కు టీ20 ప్రపంచకప్ అందించి పెట్టనప్పటికీ.. రాబోయే బ్రిటన్ (UK) పర్యటనకు సూర్యకుమార్ కనీసం జట్టుకు సైతం ఎంపికయ్యే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.




