Hyderabad: హైదరాబాద్లోని కేపీహెచ్బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉత్తరప్రదేశ్కు చెందిన రెహాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు రెహాన్ బాధితురాలి ఇంటి సమీపంలో పండ్లు విక్రయిస్తూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెపై కన్నేసిన నిందితుడు.. గత మే నెలలో ఇంట్లో చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో భయపడిన బాలిక నెలల తరబడి ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.
అయితే ఇటీవల నిందితుడు మరోసారి వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించడంతో భయాందోళనకు గురైన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వెల్లడించింది. వెంటనే వారు కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడు రెహాన్ను అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో (POCSO) చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




