పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం గురించి ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ఆర్థిక వృద్ధి రేటు 7.0 శాతం నుంచి 7.4 శాతం వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే.. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న గొడవల వల్ల ఈ అంచనాలు తగ్గే అవకాశం ఉందని శనివారం విడుదల చేసిన ప్రభుత్వ ఆర్థిక నివేదిక హెచ్చరించింది. ప్రధానంగా ఇంధన ధరలు పెరగడం, సరఫరాలో ఆటంకాలు కలగడం దీనికి ప్రధాన కారణాలు.
యుద్ధం – పెరిగిన ఖర్చులు…
అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా చేసే కీలక సముద్ర మార్గాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రపంచానికి అవసరమయ్యే దాదాపు 20 శాతం చమురు ఈ మార్గం నుంచే వస్తుంది. యుద్ధం కారణంగా రవాణా ఖర్చులు, ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీనివల్ల వస్తువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరా కూడా నిలిచిపోయింది.
Also Read:Trump: నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్
ప్రధాన అంచనాలు..
దేశానికి వచ్చే ఆదాయం కంటే చేసే ఖర్చు పెరగడాన్ని ‘కరెంట్ అకౌంట్ డెఫిసిట్’ అంటారు. ఇది వచ్చే ఏడాది మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. భారత్ తన చమురు అవసరాలలో 85 శాతం కంటే ఎక్కువ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. యుద్ధం వల్ల ఈ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల సామాన్యులపై భారం పడే అవకాశం ఉంది. రాబోయే కాలంలో నిత్యావసరాల ధరలు పెరగవచ్చు.
రేటింగ్ సంస్థల అంచనాల తగ్గింపు..
పరిస్థితులను గమనించిన పలు ఆర్థిక సంస్థలు భారత్ వృద్ధి రేటు అంచనాలను తగ్గించాయి. ICRA గతంలో 7.1% గా ఉన్న అంచనాను 6.5% కి తగ్గించింది. HDFC Bank 7.2% నుంచి 6.5-7% కి తగ్గించింది. OECD భారత వృద్ధి అంచనాను 6.1 శాతంగా పేర్కొంది.
వచ్చే వారం రిజర్వ్ బ్యాంక్ (RBI) కి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం కానుంది. ఈ యుద్ధం వల్ల పెరుగుతున్న ధరలను అరికట్టడానికి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ యుద్ధం మరికొంత కాలం కొనసాగితే, మన దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




